హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో బీజేపీ, ఈటల గ్యాంగ్ దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. ప్రజలను అయోమయానికి గురిచేసేలా వాట్సాప్లో పోస్టులు పెడుతూ.. యాసంగిలో వరి వేస్తే రైతుబంధు ఆగిపోతుందనే దుర్మార్గపు ప్రచారానికి బరి తెగించాయి. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన చైతన్య అనే వ్యక్తి.. ‘తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరి వేసే రైతులకు రైతుబంధు కట్.. నేటి సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం.. హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే ఉత్తర్వులు..’ అంటూ ఒక ఫేక్ సందేశాన్ని సృష్టించి, ‘రేపు పొద్దున ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో పరిశీలించండి’ అని తమ పార్టీలోని ఒక ప్రముఖుడికి పంపించారు. ఇదికాస్తా బయటకు లీకై సోషల్ మీడియాలో వైరలైంది. ఓటర్లను ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మార్చేందుకు ఈటల అండ్ కో.. ఉప ఎన్నిక ప్రచారం ముందునుంచే ఇలాంటి నీతిమాలిన కుట్రలకు పాల్పడుతూ వస్తున్నది. తాజాగా, వాట్సాప్ వేదికగా అలాంటి దుర్మార్గానికే పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయింది.
తిప్పికొట్టిన సర్కారు
రైతుబంధుపై దుష్ప్రచారాన్ని సర్కారు దీటుగా తిప్పికొట్టింది. తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం రైతుబంధు పథకం ఆగదని, ఇటువంటి దుర్మార్గపు ప్రచారానికి బరితెగించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. రైతుబంధు పథకంపై కొందరు దుర్మార్గులు ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని, అలాచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని అన్నారు. రైతుబంధు పథకంపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పనిలేదని చెప్పారు. కరోనా సమయంలో ఉద్యోగుల, ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలను నిలిపివేసి మరీ రైతుబంధును కొనసాగించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ‘కేసీఆర్ బతికున్నంతకాలం.. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం రైతుబంధు కొనసాగుతది. దీన్నెవరు ముట్టుకోలేరు’ అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. యథావిధిగా రైతుబంధు కొనసాగుతుందని, ఇందులో ఎవరికీ అనుమానం అవసరంలేదని ఆయన స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసి, రాజకీయ లబ్ధిపొందేందుకు ‘వరి సాగు చేస్తే రైతుబంధు కట్ చేస్తారు’ అం టూ కుట్రకు తెరలేపిన బీజేపీ తీరుపై మం త్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని, సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. రైతుబంధుపై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని హుజూరాబాద్ విత్ టీఆర్ఎస్, రైతుబంధు హ్యాష్ట్యాగ్లను జత చేస్తూ ట్వీట్చేశారు.