లక్నో: ఇటీవల శ్రీరామనవమి, శోభాయాత్ర వేళ పలు రాష్ట్రాల్లో అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ కొత్త ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన కొన్ని మార్గ దర్శకాలను పేర్కొన్నారు. ఈద్, అక్షయ త్రితియ పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త ఆదేశాలను రిలీజ్ చేశారు. అనుమతి లేకుండా ఎటువంటి మతపరమైన ర్యాలీలు, యాత్రలు చేపట్టరాదు అని సీఎం యోగి ఆదేశించారు. శాంతి భద్రతలు కాపాడుతామని నిర్వాహకులు ర్యాలీల అనుమతి కోసం అఫిడవిట్ సమర్పించాలని యోగి తన ట్వీట్లో తెలిపారు. మతపరమైన సాంప్రదాయ ఉత్సవాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, కొత్త తరహా ఈవెంట్లకు అనుమతి ఉండదని యోగి తెలిపారు. రాష్ట్ర ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు.