Srilanka Crisis | భవిష్యత్లో దేశ ప్రగతికి చైనా పెట్టుబడులను అనుమతించబోమని శ్రీలంక మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. ప్రస్తుత కష్టకాలంలో భారత్ గరిష్టంగా ఆదుకున్నదని చెప్పారు. భారత్ ఆర్థిక రంగాల్లో తోడ్పాటునందించడమే కాక.. ఇతర రంగాల్లోనూ చేయూతనిస్తున్నదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్ధ విధానాలే ఆర్థిక సంక్షోభం.. దాని వెంట రాజకీయ సంక్షోభానికి కారణమని ఆదివారం ఓ వార్తా సంస్థతో చెప్పారు. ఆర్థిక రంగ సవాళ్లపై సర్కార్ అసమర్ధ విధానాల వల్లే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే నిత్యావసరాల కోసం ప్రజలు భారీగా బారులు తీరారని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి (ఆర్థిక సంక్షోభం) ఏనాడు ఏర్పడలేదు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసరాల కోసం ప్రజలు బారులు తీరిన ఘటనలే లేవు. వీధి పోరాటాలకు ప్రజలు దిగడానికి గోటబయ్యా రాజపక్స సర్కార్ అసమర్ధతే కారణం అని విక్రమసింఘే నిప్పులు చెరిగారు.
తాను 2019లో ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగానూ, అదనపు నిల్వలు కలిగి ఉన్నట్లు తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం రాజకీయ సంకోభానికి దారి తీసింది. ఇది దేశానికి విపత్తులా పరిణమించింది. ఆర్థిక సంక్షోభం దూసుకొస్తున్న సంకేతాలు వస్తున్నా రెండేండ్లుగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. 2019లో ప్రధానిగా వైదొలిగే నాటికి దిగుమతుల చెల్లింపులకు సరిపడా నిధులు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టిందని విక్రమసింఘే పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ తలుపు తట్టేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలో శ్రీలంక ఆర్థిక మంత్రి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో కూడిన ప్రతినిధి బృందం ఐఎంఎఫ్ అధికారులను ఈ నెలలో కలువనున్నారు. ఉపశమనం కోసం ఐఎంఎఫ్ను కలవడం సమస్య కాదని, అసమర్ధ సర్కార్ సకాలంలో జోక్యం చేసుకోకపోవడమే అసలు సమస్య అని అన్నారు. ఐఎంఎఫ్ను సంప్రదించినా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేందుకు చాలా కాలం పడుతుందని విక్రమసింఘే చెప్పారు.
ప్రభుత్వం వద్ద సరిపడా ఫారెక్స్ నిల్వలు (డాలర్లు) ఉన్నాయని తాను భావించడం లేదని విక్రమసింఘే చెప్పారు. బిల్లుల చెల్లింపు కోసం అగ్రశ్రేణి ఎగుమతి సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద భారత్ సరఫరా చేసిన ఇంధనం వచ్చేనెల రెండోవారం వరకు సరిపోతుందని, తర్వాత దేశం మరింత చిక్కుల్లో పడుతుందని తెలిపారు. భారత్ ఆర్థికంగా సాయం చేయడంతోపాటు ఆర్థికేతర రంగాల్లోనూ చేయూతనిస్తున్నదని చెప్పారు. 2020, 2021ల్లో ఐఎంఎఫ్ ముందుకు వెళ్లాలన్న సూచనలను ప్రస్తుత సర్కార్ పట్టించుకోలేదని, అందువల్లే ప్రజలు వీధిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సర్కార్ తీరువల్ల దేశానికి చైనా పెట్టుబడులేమీ రాలేదని మండిపడ్డారు.