హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎస్డబ్ల్యూసీ)కు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)లకు ఎలాంటి నష్టం జరగలేదని, ఆ నిధులన్నీ భద్రంగానే ఉన్నాయని ఎస్డబ్ల్యూసీ ఎండీ జితేందర్రెడ్డి వెల్లడించారు. ఎస్డబ్ల్యూసీ ఫిక్స్డ్ డిపాజిట్లలో గోల్మాల్ జరిగినట్టు సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. ఎస్డబ్ల్యూసీ గతేడాది జనవరిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిందని, తెలుగు అకాడమీ ఘటన అనంతరం జాగ్రత్త వహించి ఆ నిధులను తనిఖీ చేశామని వివరించారు. ఏడాది పూర్తికావడంతో వాటిని విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులను సంప్రదించగా.. గతంలో ఇచ్చిన ఎఫ్డీ కాపీలపై బ్యాంకు అధికారులు అనుమానం వ్యక్తం చేశారని, పరిశీలనలో అవి నకిలీవని తేలాయని చెప్పారు. ఎన్డబ్ల్యూసీ నిధులకు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎస్డబ్ల్యూసీ పెట్టిన నిధులు, వాటిపై వడ్డీ కలిపి బ్యాంకు ఈ నెల 13న మొత్తం రూ.4.19 కోట్లు తిరిగి చెల్లించిందని వివరించారు. నకిలీ ఎఫ్డీల వ్యవహారంపై బ్యాంకు అధికారులు సంస్థాగత విచారణ జరుపుతున్నారని తెలిపారు.