న్యూఢిల్లీ, జూలై 14: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 ప్రకారం 9, 10వ తరగతి విద్యార్థులకు తృతీయ భాష తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మంగళవారం ప్రకటించింది. 10వ తరగతి బోర్డు పరీక్షలో మూడవ భాషను చేర్చకపోయినప్పటికీ 2027-28 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు ఆ సబ్జెక్టుకు సంబంధించి పాఠశాల స్థాయి అంతర్గత మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తృతీయ భాషలో అంతర్గత మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు సెకండరీ స్కూలు పరీక్ష సర్టిఫికెట్ను జారీ చేయబోమని తెలిపింది. సవరించిన ఈ విధానం 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో, 2027-28 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులకు వర్తిస్తుంది.
2026-27 విద్యా సంవత్సరంలో అప్పటికే 10వ తరగతిలో ఉన్న విద్యార్థులు ఈ కొత్త నిబంధనల ప్రకారం మూడవ భాషను అభ్యసించాల్సిన లేదా అందులో అర్హత సాధించాల్సిన అవసరం ఉండదు. జూలై 10న విడుదలైన సీబీఎస్ఈ సర్క్యులర్ ప్రకారం 2027-28 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులు ‘ఆర్3’గా పేర్కొంటున్న మూడవ భాషలో పాఠశాల స్థాయి మూల్యాంకనంలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. అప్పుడే వారు సెకండరీ స్కూలు పరీక్ష పాస్ సర్టిఫికెట్ని పొందేందుకు అర్హులవుతారు. మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు అనుసరించాల్సిన విధానాన్ని కూడా బోర్డు వివరించింది.
10వ తరగతి విద్యార్థి మూడవ భాష అంతర్గత మూల్యాంకనంలో ఉత్తీర్ణులు కాకపోతే బోర్డు పరీక్ష ఫలితాలు వెలువడటానికి ముందే సంబంధిత పాఠశాల ఆ విద్యార్థికి పునఃమూల్యాంకనాన్ని(రీఅసెస్మెంట్) నిర్వహించాలి. ఈ అంశంపై బోర్డు పరీక్షలో ప్రశ్నలు అడగనప్పటికీ 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడానికి అంతర్గత మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరిగా మారింది.