ఎన్నికల్లో బాండు పేపర్పై రాసి హామీ ఇచ్చిన పసుపు బోర్డు ఏమైందని నిలదీసిన రైతులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (బీజేపీ) కారును ఉరికించారు. గెలిచిన 5రోజుల్లో బోర్డు తెస్తానని చెప్పి తప్పించుకు తిరుగుతున్న అర్వింద్ను నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామస్థు లు అడ్డుకొన్నారు. నిరసన తెలుపడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన అర్వింద్ రైతులమీదికి కారును తీసుకెళ్లాలని డ్రైవర్ను ఆదేశించి పరారయ్యారు. రైతులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
నిజామాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులపైకి ఓ కేంద్ర మంత్రి కొడుకు కారు ఎక్కించి చంపిన ఘటన మరువక ముందే అలాంటిదే నిజామాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. పసుపు బోర్డుపై ప్రశ్నించిన రైతన్నలపైకి కారును ఉరికించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి తప్పించుకు తిరుగుతున్న ఎంపీ అర్వింద్ను ఇందల్వాయి మండలం గన్నారంలో రైతులు అడ్డగించారు. పసుపుబోర్డు ఏమైందని ప్రశ్నించారు. రైతుల నిలదీతతో అసహనానికి గురైన ఎంపీ.. ఏకంగా వారిపైకి కారును తీసుకెళ్లమని డ్రైవర్ను ఆదేశించారు. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో అప్రమత్తమైన రైతులు పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
నిరసనల హోరు
‘మోసకారి అర్వింద్ డౌన్ డౌన్’ అనే నినాదాలతో ఆదివారం 44వ జాతీయ రహదారి దద్దరిల్లింది. గన్నారంలో ఎంపీ అర్వింద్ పర్యటన తీవ్ర నిరసనల మధ్యనే సాగింది. గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీని ప్రజలు అడ్డగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు. గో బ్యాక్ అని నినదించడంతోపాటు జాతీయ రహదారి వెంట ఎంపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. పసుపు బోర్డు కోసం రాసిచ్చిన బాండ్ పేపర్తో రైతులు ఎంపీని ప్రశ్నించారు.
ఊహించని విధంగా నిరసనలు వ్యక్తం కావడంతో అర్వింద్ ఆగమాగం అయ్యాడు. కొద్దిసేపటికే అక్కడి నుంచి వెనుదిరిగారు. తన అనుచరులను రెచ్చగొట్టి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై దాడులకు పురిగొల్పారు. బీజేపీ శ్రేణులు రౌడీ మూకల మాదిరిగా దాడులు చేయడంతో పలువురు రైతులు, టీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.