నిజామాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కేసీఆర్ పాలన పరుగులు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పరిపాలన అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం సంస్కరణలను తీసుకువచ్చింది. వాటి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి. ప్రజల చెంతకే పాలన చేర్చడం, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో నూతన మండలాలను ఏర్పాటు చేసింది. దాదాపు ఆరేండ్ల తర్వాత మరోసారి నూతన మండలాలు పురుడు పోసుకోవడంతో భౌగోళిక స్వరూపం మార్పునకు గురైంది. జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ నుంచి డోంగ్లిని మండలంగా ఏర్పాటు చేయడంతో కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 23 మండలాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో డొంకేశ్వర్, ఆలూర్ కొత్త మండలాలు ఆవిర్భవించగా.. బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి నుంచి పొతంగల్, బోధన్ నియోజకవర్గంలో సాలూరా మండలం ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లాలో 29 మండలాలు కాస్త 33కు చేరుకున్నాయి. కొత్త మండలాల్లో పాలన ప్రారంభించుకొని కొంగొత్త బాటలో పయనిస్తుండగా.. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా నూతన మండలం త్వరలో అధికారికంగా ప్రారంభం కానున్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు దశాబ్దాల కల నెరవేరగా… కలలో కూడా ఊహించని కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు సైతం పురుడుపోసుకున్నాయి. సమైక్య పాలనలో మండలం ఏర్పాటు చేయాలంటే అదో ఒక ప్రహసనం. నాటి ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రవర్తించేవి. పరిపాలనాపరంగా అనేక ఇక్కట్లు ఎదురైనప్పటికీ జనాల నుంచి డిమాండ్ వినిపించినా ఆంధ్రా పాలకులు తమకేమీ కనిపించనట్లుగానే వ్యవహరించేవారు.అలా మరుగున పడుతూ వచ్చిన కొత్త జిల్లాలు, కొత్త మండలాల సమస్య కాస్త కేసీఆర్ సర్కారు హయాంలో సులువుగా నెరవేరింది. 2016, అక్టోబర్ 11న కొత్త జిల్లాలతో పాటే కొన్ని మండలాలను ఏర్పాటు చేశారు. అనంతరం పలుచోట్ల ప్రజల నుంచి మరికొన్ని మండలాల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున వినతులు రావడంతో స్థానిక ఎమ్మెల్యేల ద్వారా సర్కారుకు చేరిన డిమాండ్లు సైతం నెరవేరాయి. ఈ విధంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఐదు మండలాలు ఆవిర్భవించగా పరిపాలనను షురూ చేసుకుని కొంగొత్త బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో బోధన్ నియోజకవర్గంలోని సాలూరా నూతన మండలం అధికారికంగా త్వరలో ప్రారంభం కానున్నది.
ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం
రాష్ట్రంలో మూడంచెల పరిపాలన వ్యవస్థ చాలా ఏండ్లుగా కొనసాగుతున్నది. కింది స్థాయిలో మండల స్థాయి పరిపాలన వ్యవస్థ అన్నది ప్రభుత్వానికి ఆయువు పట్టులాంటిది. సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ భౌగోళిక విస్తీర్ణంలో నెలకొన్న అనేక మండలాలు ప్రజల సౌకర్యాల మేరకు విభజనకు గురయ్యాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో 36 మండలాలు ఉండగా కొత్త జిల్లాల ఏర్పాటుతో కామారెడ్డిలో 22 మండలాలు, నిజామాబాద్లో 29 మండలాలు ఏర్పాటయ్యాయి. దాదాపు ఆరేండ్ల తర్వాత ఉమ్మడి జిల్లాలో మరోసారి నూతన మండలాలు పురుడు పోసుకోవడంతో భౌగోళిక స్వరూపం మార్పునకు గురైంది. జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం నుంచి డోంగ్లి మండలం ఏర్పాటు కావడంతో కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 23కు చేరింది. ఆర్మూర్ నియోజకవర్గంలో డొంకేశ్వర్, ఆలూర్ కొత్త మండలాలు ఏర్పాటు కాగా, బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి నుంచి పోతంగల్, బోధన్ నియోజకవర్గంలో సాలూరా మండలం ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లాలో 29 మండలాలు కాస్తా 33కు చేరుకున్నాయి. 2016 అక్టోబర్ నాటికి ఉమ్మడి జిల్లాలో 36 మండలాలతో ఉండగా ఇప్పుడు ఉభయ జిల్లాల్లో మండలాలు ఏకంగా 56కు చేరుకున్నాయి.
కేసీఆర్ సాహసోపేత నిర్ణయం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్య 56. ఒకప్పుడు 36 మండలాలతోనే కొనసాగిన ప్రాంతంలో దాదాపుగా రెట్టింపునకు దగ్గర్లో మండలాల ఏర్పాటు చేయడం సాహసమే. అదీ కేసీఆర్ లాంటి దార్శనీకుడికే సాధ్యం. ప్రజలకు ఏది అవసరమొచ్చినా వెంటనే పనులు చేసి పెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఇలాంటి పనులే గత సమైక్య పాలనలో జరగాలంటే ప్రజలంతా దీక్షలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇలా ఒకటేమిటి అనేకనేక పోరాటాలు చేస్తే కానీ ప్రభుత్వాలు దిగి వచ్చేది కాదు. కేసీఆర్ పరిపాలనలో ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వమే గుర్తించి మేలు చేస్తోంది. ఇందుకు పరిపాలన వికేంద్రీకరణ అన్నదే చక్కని ఉదాహరణగా నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చేరువైన పాలన…
సీఎం కేసీఆర్ పరిపాలన సంక్షేమంలో దూసుకెళ్తుంది. అనేక పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. అవినీతి, అక్రమాలకు స్థానం లేకుండా అర్హులకే పథకాలు చేరుతున్నాయి. ఇందుకు వికేంద్రీకరణ ఫలాలే చక్కని నిదర్శనం. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ లేదంటే జిల్లా స్థాయి అధికారులు పర్యటనలకు వెళ్లాలంటే సమయం సరిపోయేది కాదు. అలాంటిది జిల్లాలు, మండలాలు విభజనకు గురయ్యాక ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటుతో పరిపాలన సులువైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఏర్పాటుతో పరిపాలనాపరమైన సౌలభ్యం అన్నది స్థానిక ప్రజలకు చేరువైంది. కామారెడ్డి జిల్లా వాసులు గతంలో నిజామాబాద్కు వ్యయప్రయాసాలకోర్చి వచ్చేది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనాలకు పనులు కూడా పూర్తయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. వికేంద్రీకరణ ద్వారా సులువుగా పనులు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ పథకాల అమలులో కచ్చితత్వం అన్నది ప్రతిచోట కనిపిస్తోంది. మండల స్థాయిలో తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, పోలీస్ స్టేషన్ ఇలా ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటుచేయడం ద్వారా అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.