ఖలీల్వాడి, నవంబర్ 25 : నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. నూతన కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గత వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. కొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పదేపదే చెబుతున్నప్పటికీ పంట రుణాల పంపిణీలో బ్యాంకులు ఉదాసీన వైఖరిని వీడడం లేదని, పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లా యంత్రాంగం తరఫున కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది వానకాలం సీజన్లో పంట రుణాల పంపిణీలో 79 శాతం లక్ష్యం సాధించగా, ఈసారి మరింతగా పెరగాల్సింది పోయి 72 శాతానికి పడిపోవడం ఏమిటని ఆయా బ్యాంకుల అధికారులను ప్రశ్నించారు.
2,308 కోట్ల రూపాయల పంపిణీ లక్ష్యం కాగా, 1,664.45 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. రుణాల రికవరీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తిస్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిన రుణాలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మెప్మా అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలు ఇప్పించేందుకు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకుని, అర్హత ఉన్న వారికి యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ప్రతినిధి వైభవ్ వ్యాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్రావు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.