గాంధారి, నవంబర్ 25: ఓ భూవివాదంలో సర్పంచ్ ఇంటిపై దాడిచేసిన ఘటన మండలంలోని సోమారం తండాలో చోటు చేసుకున్నది. సోమారం తండాకు సర్పంచ్ కిషన్ నాయక్ ఇంటిపై కొత్తబాది తండాకు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దాడిచేశారు. ఇందుకు సంబంధించి స్థానికులు, ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని చద్మల్ రోడ్డు పక్కన కిషన్నాయక్ పేరు మీద ఉన్న రెండు గుంటల భూమిని 2011 సంవత్సరంలో కొత్తబాది తండాకు చెందిన శంకర్కు విక్రయించారు. ఇందుకుగాను రూ. 4.5 లక్షలు అడ్వాన్సుగా శంకర్ ఇచ్చాడు. మిగతా రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శంకర్కు కిషన్నాయక్ సూచించారు. ఈ విషయంలో జాప్యం జరగడంతో దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు సైతం నిర్వహించారు. శుక్రవారం కిషన్నాయక్ ఇంటిపై శంకర్నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి దాడిచేశారు. సర్పంచ్ కిషన్నాయక్, అతని భార్య బూలీనితోపాటు మార్గమధ్యంలో ఆయన కొడుకు రవిపై కూడా దాడికి పాల్పడారు. దీంతో కిషన్నాయక్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొన్నారు.
ఇదిలా ఉండగా తాము కొనుగోలు చేసిన రెండు గుంటల భూమికి డబ్బులు చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించకుండా కిషన్నాయక్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ శంకర్, అతని భార్య సునీత పురుగుల మందు తాగినట్లు ఎస్సై వివరించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేట్కు తరలించినట్లు తెలిపారు.