రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం అన్ని జిల్లాల్లో అమలు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్లో ప్రవేశపెట్టిన పథకం విజయవంతం కాగా.. రాష్ట్రంలోని నాలుగు ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండలంలో దళితబంధు అమలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో 100 మంది లబ్ధిదారుల చొప్పున దళితబంధును వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో నిజాంసాగర్ మండలంలో 1800 కుటుంబాలకు, తొమ్మిది నియోజకవర్గాల్లో 900 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకు వచ్చిన ప్రతిష్టాత్మక దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సర్కారు సిద్ధమైంది. గత నెలలోనే జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం జారీ చేసిన ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాం గం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నది. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాల నుంచి నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా నుంచి జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం ఎంపికైంది. మరోవైపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా 100 మందికి దళితబంధు పథకం కింద రూ.10లక్షల విలువతో యూనిట్లు స్థాపించడానికి అనువుగా ఉన్న సౌకర్యాలను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేస్తున్నారు. వివిధ పరిశ్రమల స్థాపనతో లబ్ధిదారులు నెలకు గౌరవ ప్రదమైన ఆదాయం ఆర్జించే విధంగా యూనిట్లను రూపకల్పన చేస్తున్నారు.
భిన్నమైన యూనిట్లు…
దళితబంధు పథకం ద్వారా అందిస్తున్న రూ.10లక్షల విలువ చేసే యూనిట్లు మూలంగా పేద కుటుంబాలు ఉన్నతికి తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పం. సర్కారు భారీ లక్ష్యంతో దళిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేయాలనే ఆలోచనతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పథకం విలువకు తగ్గట్లుగా యూనిట్లు స్థాపించి ఇవ్వడం ద్వారా లబ్ధిదారులు నేరుగా ఆదాయాన్ని సమకూర్చుకునేలా దళితబంధును రూపొందించా రు. ఉదాహరణకు ఎలాంటి ఆదరణలేని దళితకుటుంబానికి రూ.10లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఈ మొత్తంతో లబ్ధిదారుడు ఇష్టానుసారంగా ఏదేని పరిశ్రమను స్థాపించుకోవచ్చు. వంద రకాల యూనిట్లను ఇందుకోసం సిద్ధం చేస్తున్నా రు. ఇందులో లబ్ధిదారుడికి డ్రైవింగ్లో నైపుణ్యం ఉంటే కారు కొనుగోలు చేసి ట్యాక్సీ కింద నడుపుకునేలా రవాణా శాఖ నుంచి శిక్షణ సైతం ఇప్పిస్తున్నారు. ఒక లబ్ధిదారుడు కారు కొనుగోలుకు ముందుకు వస్తే ప్రభుత్వ అధికారులు నేరుగా మంజూరైన దళితబంధు మొత్తంతో యూనిట్ను కొనుగోలు చేసి ఇస్తారు. కారు స్థానంలో ట్రాక్టర్ సైతం తీసుకోవచ్చు. ఇలా ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉపాధికి మంచి మార్గంగా కనిపిస్తున్న పథకాలను క్రోడీకరించి దళితబంధుకు ఎం పికైన వారికి అందించబోతున్నారు. ఇందులో నుం చి వారి ఇష్టానుసారంగానే యూనిట్ను ఎంపిక చేసుకునే వీలును ప్రభుత్వం కల్పిస్తున్నది.
ఉమ్మడి జిల్లాకు 2700 యూనిట్లు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మార్చి నెలాఖరులోగా దాదాపు 2700 మంది దళిత కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం జరుగనున్నది. ప్రతి నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తే 9 నియోజకవర్గాల్లో 900 మంది అవుతారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపికైన నిజాంసాగర్ మండలంలో 1800 కుటుంబాలను దళితబంధు పథకానికి అర్హులుగా కామారెడ్డి జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇలా రెండు జిల్లాల్లో దాదాపు 2,700 మందికి లబ్ధి చేకూరుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో దాదాపు మూడున్నర లక్షల మంది దళిత సమాజం జీవనం సాగిస్తున్నది. నిజామాబాద్ జిల్లా మొత్తం జనాభా 15లక్షల 77వేలు ఉండగా ఇందులో పురుషులు 7.71లక్షలు కాగా, స్త్రీలు 8.05లక్షల మంది ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల జనాభా 2.17లక్షలు ఉండగా పురుషులు 1.04లక్షలు, స్త్రీలు 1.12లక్షలు ఉన్నారు. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాల శాతం 13.78 శాతంగా ఉన్నా రు. కామారెడ్డి జిల్లా మొత్తం జనాభా 9.72లక్షలు ఉండగా పురుషులు 4.78 లక్షలు కాగా స్త్రీలు 4.94 లక్షలుగా ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల జనాభా 1.53 లక్షలు కాగా పురుషులు 74,133, స్త్రీలు 79,169 మంది ఉన్నారు. మొత్తం జిల్లా జనాభాలో షెడ్యూల్డ్ కులాల శాతం 15.76 శాతంగా ఉంది.
శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే…
2021-22 ఆర్థిక సంవత్సం ముగింపులోపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే… అసెంబ్లీ నియోజకవర్గంలోని పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎక్కడైనా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత గల దళిత కుటుంబాలకు ఈ పథకం అందిస్తారు. శాసనసభ్యుల నేతృత్వంలోనే వంద మంది అర్హులను తొలి దఫాలో ఎంపిక చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు నియోజకవర్గంలో వంద మందికి లాభం జరిగిన తర్వాత వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరింత మంది పేద దళిత కుటుంబాలకు దళితబంధును అందించబోతున్నారు. పథకం ప్రారంభమై కొద్ది రోజులే అయిన నేపథ్యంలో మొదట కొద్ది మందికి అమలు చేసి కాలక్రమేణా అర్హులందరికీ దళితబంధు ద్వారా పేదల ను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పూర్తిగా నగరంగా ఉన్నప్పటికీ ఇక్కడ కూడా దళితబంధును అమలు చేస్తారు. ఈ నియోజకవర్గంలోని దళితకుటుంబాలకు తొలి విడుతలో వందమందికి అందిస్తారు. ఏ డివిజన్ లో ఎవరికి అన్నది స్థానిక ఎమ్మెల్యేనే నిర్ణయిస్తారు.