మలిదశ తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రసమితికి ఆవిర్భావం నుంచీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండగా నిలుస్తూ వస్తున్నది. పిడికెడు మందితో పార్టీ ప్రారంభమైనప్పుడు తోడుగా నిలిచి, తొలి అడుగుల్లో వెంటనడిచింది ఈ జిల్లానే. టీఆర్ఎస్ పురుడుపోసుకున్న తొలినాళ్లలోనే కేసీఆర్పై సంపూర్ణ విశ్వాసంతో.. 2001 స్థానికఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకున్నది వేల్పూర్ మండలం మోతె గ్రామం. అక్కడి మట్టిని వెంట తీసుకెళ్లిన ఉద్యమనేత కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అంతే యాదితో దాన్ని తీసుకొచ్చి ముడుపు చెల్లించుకున్నడు. ఉద్యమాన్ని, టీఆర్ఎస్ను పురిట్లోనే అణిచివేసే కుటిలయత్నాలు జరుగుతున్న కాలంలో ఉమ్మడిరాష్ట్రంలో తొలి జడ్పీ చైర్మన్ను అందించింది ఇందూరు జిల్లా. అప్పటినుంచి 20ఏండ్ల ప్రస్థానంలో జిల్లా ప్రజలు గులాబీ పార్టీని అంతే ప్రేమగా ఆదరిస్తూ వస్తున్నారు.
గులాబీ కంచుకోట..
2001, ఏప్రిల్ 27న పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఆవిర్భావం నుంచి చారిత్రక ఇందూరు ప్రాంతం అండగా నిలుస్తూ వస్తోంది. పార్టీ స్థాపించిన తొలి రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని విజయాలను సాధించి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న తొలి రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఢంకా బజాయించిన గులాబీ పార్టీకి తరువాత సాధారణ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేశారు. 2004, 2009 వరుస ఎన్నికల్లో మిగిలిన జిల్లాలతో పోలిస్తే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. 2014 స్వరాష్ట్రంలో 9 నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాల్లో విజయ దుందుభి మోగించి రికార్డు సాధించింది. 2018 ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో గెలిచి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని పదిలపర్చుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని విజయాన్ని దక్కించుకున్న గులాబీ పార్టీకి రాజకీయ సమీకరణాలతో నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దక్కింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సదాశివనగర్ జడ్పీటీసీ గాదారి అనిత 2006 నుంచి 2008 వరకు జడ్పీ చైర్పర్సన్గా పని చేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో తొలి జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుని రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది.
ఆది నుంచి ఉద్యమ బావుటా ఎగరేసిన ప్రాంతం
నిజామాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్ర కాంక్షను బలంగా వినిపించిన జిల్లా ఇందూరు. సమైక్య పాలనలోనే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన జిల్లా. ఉద్యమ నేతగా కేసీఆర్ ప్రారంభించిన మలి దశ స్వరాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్కు ఆవిర్భావం నుంచి నిజామాబాద్ జిల్లాలో తిరుగులేని మద్దతు లభిస్తూనే ఉంది. టీఆర్ఎస్ పురుడుపోసుకున్న తొలినాళ్లలోనే కేసీఆర్పై సంపూర్ణ విశ్వాసంతో 2001లో స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సమైక్య పాలనలో ఉద్యమాన్ని, టీఆర్ఎస్ను అణచివేసే కుటిల ప్రయత్నాలు జరుగుతున్న కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో తొలి జడ్పీ చైర్మన్ను అందించింది ఇందూరు జిల్లా. ఇది టీఆర్ఎస్కు తిరుగు లేని మనో ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని ఇచ్చింది. అలా ప్రజా క్షేత్రంలో గులాబీ పార్టీకి ప్రారంభమైన మద్దతు తరువాత అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. అన్ని వేళలోనూ తెలంగాణ రాష్ట్ర సమితికి అం డగా నిలుస్తూ వచ్చారు. జిల్లాలో నాటి నుంచి నేటి వరకు సకల జనాదరణతో,లక్షల కార్యకర్తల సైన్యంతో తిరుగు లేని పార్టీగా కొనసాగుతున్నది. ద్విదశాబ్ది ఉత్సవాలతో గులాబీ జెం డా రెపరెపలాడుతూ సగర్వంగా బంగారు తెలంగాణ బాటలో పయనిస్తోంది. నవంబర్ 15న వరంగల్ వేదికగా తెలంగాణ విజయ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రస్థానంలో కీలకమైన ఘట్టాలపై ప్రత్యేక కథనం.
ఆత్మగౌరవానికి ప్రతీక..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీకి ఆది నుంచి ఆటంకాలు సృష్టించేందుకు కాంగ్రెస్, టీడీపీలు అనేక కుట్రలు పన్నాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన వ్యక్తి టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్. రెండు దశాబ్దాల కాలంలో ఏడేండ్ల స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఉద్యమ పార్టీకి ఇప్పుడు శాశ్వత కార్యాలయ భవనాలు దక్కాయి. కీలకమైన సమయంలో కిరాయి గదుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కొనసాగాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీకి కిరాయి ఇచ్చేందుకు పలువురు ముందుకు రాని దుస్థితి కనిపించింది. కానిప్పుడు నిజామాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనం చూడచక్కగా రూపుదిద్దుకున్నది. అవమానాలు ఎదుర్కొన్న చోటనే అద్భుతమైన నిర్మాణంతో తళుకులీనుతోంది. ఎకరం స్థలంలో 8352 చదరపు అడుగుల మేర విస్తీర్ణంతో మిగిలిన రాజకీయ పార్టీల భవనాలకు దీటుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మినీ తెలంగాణ భవన్గా పిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనం… తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో మేళవింపుతో రూపుదిద్దుకుంది.
ఉద్యమ దిక్సూచిగా మోతె
మలి దశ ఉద్యమానికి నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతె గ్రామం దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే మద్దతునిస్తామని 2001 మే 5న మోతె గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఉద్యమ బాటలో మరెన్నో గ్రామాలు కదిలేలా స్ఫూర్తి నింపింది. దీంతో ఎన్నో గ్రామాలు ఉద్యమానికి మద్దతు తీర్మానాలు చేసి మోతె గ్రామ బాటలో నడిచాయి. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మోతె స్ఫూర్తిని వాడవాడలో చాటి చెప్పారు. దివంగత ఉద్యమ నేత వేముల సురేందర్ రెడ్డితో కలిసి మోతెకు వచ్చి స్వయంగా గ్రామస్తులతో మాట్లాడారు. ఉద్యమానికి మోతె దిక్సూచిలా నిలిచిందని అభినందించారు. గడ్డ మీది మట్టిని ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక తిరిగి ఆ మట్టి ముడుపును మోతె గడ్డ పైనే విప్పుతానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 మార్చి 28న వేముల సురేందర్ రెడ్డి, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితర నాయకులతో కలిసి మోతెకు వచ్చి ముడుపు విప్పారు. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోతె టీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవ తీర్మానాలతో అండగా నిలిచింది. టీఆర్ఎస్ అంటే మోతె గుర్తుకొచ్చినట్లు, మోతె అనగానే కేసీఆర్ సార్ గుర్తుకొస్తారని ఎన్నో గ్రామాల వారు ఇప్పటికీ చెబుతుంటారు. తెలంగాణ కోసం ఊరు ఊరంతా ఏకతాటిపై నిలబడి అండగా నిలిచిన చరిత్ర మోతె గ్రామస్తులతోపాటు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ గర్వకారణమే.
మాచారెడ్డి.. ఏకగ్రీవాలకు స్ఫూర్తి..
టీఆర్ఎస్ ఆవిర్భవించిన కాలంలో నాడు స్వరాష్ట్ర ఆ కాంక్షకు ప్రతిరూపంగా నిలిచింది కామారెడ్డి జిల్లా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన పదవిని త్యాగం చేసి ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్కు ఈ ప్రాంతం నీరాజనం పలికింది. టీఆర్ఎస్ పురుడు పోసుకుంటున్న సమయంలో కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉవ్వెత్తున తెలంగాణ భావజాల వ్యాప్తి ఎగిసి పడింది. నాడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డి మండలంలో అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం సంచలనం సృష్టించింది. ఆంధ్రా పార్టీలకు చెంప చెల్లుమనిపించేలా సాగిన నాటి మాచారెడ్డి ఘటన నేటికీ ఉద్యమ గుర్తుగా చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకు పెట్టని కోటగా నిలవడంతో పాటు ఆది నుంచి చెదరని ఆదరణను చూపిస్తూ ఇక్కడి ప్రాంత ప్రజలు స్వరాష్ట్రంలో తొలి ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి అఖండ విజయాన్ని అం దించారు. ఉమ్మడి జిల్లాలో భౌగోళికంగా సరిహద్దు ప్రాంతంగా ఉన్న మాచారెడ్డి మండలంలోని ప్రజలం తా నాడు చూపించిన ఉద్యమ స్ఫూర్తి చరిత్ర పుటల్లో పదిలంగా లిఖించుకున్నదనడంలో అతిశయోక్తి లేదు.
తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ప్రాంతంలో ఉద్యమ ఉవ్వెత్తున ఎగిసి పడిం ది. సమైక్యాంధ్ర పాలకుల కుట్రలను భగ్నం చేయడంతో పాటు అధికారంలో ఉండి తెలంగాణ కోసం పాటుపడని నాయకుల భరతం పట్టారు. 2009, నవంబర్ 30వ తేదీన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సమయం. తెలంగాణ వచ్చు డో… కేసీఆర్ సచ్చుడో నినాదంతో దీక్షకు దిగిన సందర్భంలో రాష్ట్రం మొత్తం ఉద్విగ్న క్షణాలు ఏర్పాడ్డాయి. ఓ వైపు సమైక్య పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో శ్రీకాంతా చారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆహుతైన పరిస్థితులు. అంతలోనే ప్రత్యేక రాష్ట్రం కోసం కామారెడ్డి పట్టణ కేంద్రంలోనూ నిజాంసాగర్ రోడ్డులో టవరెక్కిన పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మ త్యాగం చేసుకున్నాడు. విధుల్లోనే వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకుని అమరుడయ్యాడు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ ప్రాణాలు విడిచి ఉద్యమానికి ఊపిరి ఊదాడు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రలో కిష్టయ్య తొలి అమరుడిగా నిలిచాడు.