నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 22 : ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అధికారుల అనుమతి కానీ, కనీస సమాచారం కానీ లేకుండా.. పాఠశాల విధులకు ఏకంగా 15ఏండ్లుగా గైర్హాజరవుతున్నారు. నిబంధనల ప్రకారం టీచర్లు ఏడాదిపాటు గైర్హాజరైతే రాజీనామా చేసినట్లు లెక్క. కానీ 2006 నుంచి సెలవులు పెట్టకుండా, సమాచారం ఇవ్వకుండా ఆమె విధులకు రాకపోయినా.. కనీసం గుర్తించినవారు లేరు. చూసినవారు, తనిఖీలు చేసినవారూ లేరు. పైగా ఆ స్కూల్ ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో లేదు.. నిజామాబాద్ జిల్లాకేంద్రం లోనిదే. నగరంలోని కోటగల్లీ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వై.స్వప్న 2006 ఫిబ్రవరి 7వ తేదీనుంచి విధులకు రావడం లేదు. 2005 నుంచి పాఠశాలకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుల జాబితాను రాష్ట్రప్రభుత్వం కోరిన నేపథ్యంలో సదరు టీచరు పత్తాలేకుండా పోయిన విషయాన్ని గత జూలైలో జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నోటీసు జారీ చేసినా ఆ ఉపాధ్యాయురాలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో తాజాగా శుక్రవారం డీఈ వో దుర్గాప్రసాద్ ఆమెకు ఫైనల్ నోటీసును పంపారు. సీసీఏ రూల్స్, లీవ్రూల్స్ అండ్ ఫండమెంటల్ రూల్స్ ప్రకారం సదరు టీచరుపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నోటీసుకూ స్పందించని పక్షంలో కలెక్టర్ అనుమతితో విధుల నుంచి డిస్మిస్ చేస్తామని డీఈవో తెలిపారు.
తనిఖీలు మరిచిన విద్యాశాఖ అధికారులు
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుండాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి, ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష జరుపాలి. కానీ 15ఏండ్లుగా స్వప్న అనే స్కూల్ టీచర్ విధులకు రాకపోయినా.. ఎవరూ కనీసం గుర్తించకపోవడం విస్తుగొల్పుతున్నది. స్వయంగా జిల్లా కలెక్టర్తోపాటు శాఖాధికారులు ఉంటున్న జిల్లా కేంద్రంలోనే ఇలాంటి సంఘటన వెలుగులోకి రా వడం విద్యాశాఖ అధికారుల వైఫల్యంగా స్పష్టమవుతున్నది. పాఠశాలల తనిఖీలను మరిచిన అధికారులు మొద్దునిద్ర పోవడం వల్లే ఈ తరహా ఉ దంతాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తని ఖీ చేసి ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.