ఖలీల్వాడి, అక్టోబర్ 22 : నిజామాబాద్ జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేసేందుకు డోర్ టూ డోర్ తిరిగేందుకు 360 బృందాలను ఏర్పాటు చేశారు. థర్డ్వేవ్ రాకుండా కట్టడి చేసేందుకు 100 శాతం వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో వ్యాక్సిన్ వేసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఇంటింటికీ తిరుగు తున్నారు. కలెక్టర్ సైతం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొదటి డోస్ 7లక్షల 82 వేల 765, రెండో డోస్ 2 లక్షల 26 వేల 468 మందికి వేశారు. ఇందులో పురుషులు 4లక్షల 67వేల 460, స్త్రీలు 5లక్షల 41 వేల 640 మంది ఉన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల వారు 5లక్షల 40వేల 272, 45 నుంచి 60 సంవత్సరాల వారు 3లక్షల 5 వేల 223 మంది, 60 సంవత్సరాల పైబడిన వారు లక్షా 63 వేల 738 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11లక్షలు మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 10,09,233 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 15 రోజుల్లో 100 శాతం పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. టీకాపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. వ్యాక్సిన్ వేసుకోని వారికి పాఠశాలలు, రేషన్ దుకాణాలు, కార్యాలయాల్లో అనుమతి ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్ నుంచి రక్షించుకునేందుకు టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి
జిల్లాలో కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు 15 రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం. ఇంటింటికీ వెళ్లి 18 సంవత్సరాలు నిండిన వారి వివరాలను సేకరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ సహకరించి టీకా తీసుకోవాలి.
-బాల నరేంద్ర,
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నిజామాబాద్