ఖలీల్వాడి, అక్టోబర్ 21 : ఆర్టీసీని దేశంలోనే ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దుతామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిజామాబాద్ రీజియన్ టీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా రెండో మహాసభను గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాజిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ అంటే వ్యా పారం, సామాజిక సేవ అని.. రెండింటికీ సమప్రాధాన్యతనిస్తూ సంస్థను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత సీఎం కేసీఆర్ తమపై పెట్టారని అన్నారు. అన్ని డిపోలు నష్టాల్లో ఉన్నాయని అయినప్పటికీ ఒకటో తారీఖున జీ తాలు చెల్లించామని గుర్తు చేశారు. పీఎఫ్ సొమ్ము, సీసీఎస్ ఖాతాల్లో జమ చేశామన్నా రు. రాష్ట్రంలోని 97 డిపోల్లో 48 వేల మంది ఉద్యోగులు వి ధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. దసరా పండుగ ఒక్కరోజే రూ. 47.75 కోట్ల ఆదాయం ఆర్టీసీకి సమకూరిందని, ఎలాం టి చార్జీలు పెంచకుండానే ఆదాయం తీసుకురావడం చైర్మన్గా గర్వంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే రూ. వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించిందని తెలిపారు. ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచడమేనని పేర్కొన్నారు. కరోనా కూడా ఒక కారణమన్నారు. సీఎం కేసీఆర్ 48 వేల మంది ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణకు ఒప్పుకోలేదని, ఎలాగైనా నష్టాల నుంచి గట్టెక్కించి బతికించుకోవాలని సూచించారని తెలిపారు. సీబీఎస్, జేబీఎస్లో రిటైర్డ్ ఉద్యోగులకు వసతి సదుపాయం కల్పిస్తామని, సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణం, ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు తెలంగాణలో ఉచిత ప్రయాణ పాస్ ఇవ్వడం, ఆసరా పింఛన్ ఇవ్వాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నా రు. తార్నాకలోని ఆర్టీసీ దవాఖానని సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా తీర్చిదిద్దుతామని, మెడికవర్ దవాఖానతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మెరుగైన చికిత్సలు అందిస్తామన్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు రిటైర్డ్ ఉద్యోగుల సహకారం కావాలని కోరారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగులు బాజిరెడ్డి గోవర్ధన్ను ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రహమాన్, డీసీఎంఎస్ చైర్మ న్ సాంబారు మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నిజామాబాద్ ఆర్డీవో రవి, ప్రతినిధులు ఆనంద్, రాంచందర్, దుర్గయ్య, ఆర్టీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.