భీమ్గల్, నవంబర్ 9: దక్షిణ బద్రినాథ్గా పేరుగాంచిన లింబాద్రి లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని గ్రామాలయంలో ఉత్సవ విగ్రహాలకు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూలతో అందంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవ మూర్తులను ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అక్కడి నుంచి బోనాలు, మంగళ హారతులు, డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి తీసుకెళ్లారు. స్వామి వారి నామ స్మరణతో పట్టణం మార్మోగింది. బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. 13న స్వామి వారి కల్యాణం, 18న జాతర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పురోహితులు నంబి పార్థసారథి, విజయ్ సారథి, నంబి వాసుదేవాచార్యులు, నంబివేణు, నంబి ప్రణీత్, భక్తులు పాల్గొన్నారు.