కమ్మర్పల్లి, డిసెంబర్ 5: మగ్గం వర్క్పై ఉచిత శిక్షణ కార్యక్రమం మహిళలకు, యువతులకు మహాదావకాశంగా నిలుస్తున్నది. ఆదాయాభివృద్ధికి, ఆర్థిక సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తున్నది. పలు స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపడుతూ చేయూతనందిస్తున్నది. ప్రస్తుతం మగ్గం వర్క్ శిక్షణ నిరుద్యోగ యువతులకు ఎంతో ఉపయోగపడుతున్నది. మార్కెట్లో మగ్గం వర్క్కి మంచి డిమాండ్ ఉన్నది. పేద, మధ్యతరగతి యువతులు ప్రైవేటు కేంద్రంలో ఈ పని నేర్చుకోవడం ఖరీదైనది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సెర్ప్ సహకారంతో..ఎస్బీఐ నిర్వహణలో అందిస్తున్న ఉచిత మగ్గం వర్క్ శిక్షణ వరంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు డిచ్పల్లి మండల కేంద్రంలో మాత్రమే ఈ శిక్షణ కేంద్రం ఉండేది. ఇటీవలే కమ్మర్పల్లి మండల కేంద్రంలోనూ ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతులకు కమ్మర్పల్లి శిక్షణ కేంద్రం చక్కని అవకాశంగా మారింది.
కమ్మర్పల్లిలో కొనసాగుతున్న కేంద్రంలో మగ్గం వర్క్ శిక్షణ చురుగ్గా సాగుతున్నది. 30 రోజుల్లో మగ్గం వర్క్పై శిక్షణ దిస్తున్నారు. రెండు రోజుల్లో తొలి బ్యాచ్కు శిక్షణ పూర్తి కానున్నది. అనంతరం మరో బ్యాచ్కు శిక్షణ ప్రారంభం కానున్నది. ఇది వరకే రెండో బ్యాచ్కు శిక్షణ కోసం దరఖాస్తులను సైతం ఆహ్వానించారు. ఆసక్తి ఉన్న యువతులు ముందుకొస్తే టైలరింగ్ శిక్షణను సైతం ఇక్కడే అందించడానికి సిద్ధం చేస్తున్నారు. దూరభారంతో డిచ్పల్లిలోని శిక్షణా కేంద్రానికి ఈ ప్రాంత గ్రామీణ యువతులు వేళ్లలేని సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా సరిహద్దు వెంట ఉన్న ఈ ప్రాంత యువతులు, మహిళలకు ఈ శిక్షణను అందుబాటులోకి తెస్తే వారికి ఆర్థిక సాధికారత అందించినట్లు ఉంటుందని భావించి డీఆర్డీవో చందర్ నాయక్, ఎస్బీఐ ఉపాధి శిక్షణ విభాగం అధికారి సుధీంద్ర బాబు, డీపీఎంలు నూకల శ్రీనివాస్, రాచయ్యకు వివరించారు. వారితోపాటు సెర్ప్ సహకారంతో కమ్మర్పల్లిలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయించారు. ఈ కేంద్రంలో తొలి బ్యాచ్ యువతులు, మహిళలు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మగ్గం వర్క్ నేర్చుకున్నారు. ఆన్లైన్లో సరికొత్త డిజైన్లను సైతం ఎలా అందిపుచ్చుకోవచ్చో నేర్పిస్తూనే.. ఫైనాన్స్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులను శిక్షణ సమయంలో అందించారు. శిక్షణ పొందే అభ్యర్థులకు 30రోజుల పాటు ప్రతి రోజూ రూ.236 స్టయిఫండ్, యూనిఫాం ఇవ్వడంతోపాటు ఒకపూట ఉచిత భోజనం అందించారు. శిక్షణ పూర్తి చేసుకున్నాక ఈ రంగంలో ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వారు గానీ, వారి కుటుంబసభ్యులు గానీ మహిళా సంఘంలో సభ్యులుగా ఉంటే రుణాలు అందిస్తారు. సంఘాల్లో సభ్యులుగా లేని వారికీ రుణం అందేలా కృషి చేస్తారు.
శిక్షణ పూర్తి చేసుకున్న తొలిబ్యాచ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, సెర్ప్ సహకారంతో నెల రోజుల పాటు నిర్వహించిన మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమంలో తొలి బ్యాచ్ తమ శిక్షణను పూర్తి చేసుకున్నది. గ్రామీణ ప్రాంత పేద, నిరుద్యోగ యువతులు, మహిళలకు వరంలా అందుబాటులోకి వచ్చిన ఈ శిక్షణ కేంద్రం తొలి బ్యాచ్లో 34 మంది శిక్షణ పొందారు. వారిప్పుడు మగ్గం వర్క్ నైపుణ్యంతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. శిక్షణ కాలంలో వీరికి సాఫ్ట్, హార్డ్ స్కిల్స్ నేర్పించారు. హార్డ్ స్కిల్ కింద మగ్గం వర్క్ శిక్షణ, సాఫ్ట్ స్కిల్ కింద జీవితంలో సవాళ్లను అధిగమించడం, లక్ష్యాన్ని చేరుకోవడం, వ్యాపార దక్షత, ఆత్మ విశ్వాసం, టైమ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై వికాస శిక్షణను అందించారు. దీంతో శిక్షణ పొందిన వీరిలో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది. వీరికి శిక్షణ పొందిన సర్టిఫికెట్లు, ఉపాధి రుణాలను అందించే ఏర్పాట్లలో ఎస్బీఐ ఉపాధి శిక్షణ, సెర్ప్ అధికారులు ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
నిరుద్యోగ యువతులకు మగ్గం వర్క్ శిక్షణ తప్పనిసరిగా భరోసానిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. నైపుణ్యంతో ఆదాయాభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్న వారికి సక్సెస్ గ్యారంటీ ఉంటుంది. మార్కెట్లో మగ్గం వర్క్కి మంచి డిమాండ్ ఉన్నందున శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.
-సుధీంద్ర బాబు, ఎస్బీఐ శిక్షణ విభాగం అధికారి
అధికారుల సహకారంతో సదావకాశం
కమ్మర్పల్లిలో ఎస్బీఐ ఆధ్వర్యంలో సెర్ప్ సహకారంతో మగ్గం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతులు, మహిళలకు మంచి అవకాశం లభించింది. ఇక్కడ ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు.
శిక్షణతో భరోసా పెరిగింది
కమ్మర్పల్లిలో మగ్గం వర్క్ శిక్షణ సౌకర్యంతో మాలాంటి నిరుద్యోగ యువతులకు మంచి అవకాశం లభించింది. చక్కని శిక్షణ, వ్యాపార ఒత్తిడిని ఎదుర్కొనేలా వ్యక్తిత్వ వికాస తరగతులతో మాలో ఉపాధి భరోసా పెరిగింది.
-వీణ, శిక్షణ పొందుతున్న యువతి