యాసంగిలో పంటలకు నీటిరంది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వివిధ ప్రాజెక్టుల ఆయకట్టు కింద సాగుచేస్తున్న 2.64 లక్షల ఎకరాల కోసం.. 23.832 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. నిజామాబాద్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహాబోర్డు సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. వానకాలం వడ్ల కొనుగోలులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. యాసంగిలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగుచేయాలని వేముల సూచించారు.
నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 4 : యాసంగిలో సాగయ్యే పంటలకు నీటి రంది లేదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రైతులు, జిల్లాలోని శాసనసభ్యుల అభిప్రాయాలను తీసుకొని పూర్తిస్థాయి ఆయకట్టు 2.64 లక్షల ఎకరాలకు 23.832 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హరితహారం, కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకాలతో రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవడంతో అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పుర్తిస్థాయి నీటిమట్టంతో అలుగులు పారాయని అన్నారు. ఈ యాసంగికి కూడా ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటిమట్టంతో తొణికిసలాడుతున్నాయని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో నీటిని విడుదల చేయడానికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. నీరు పుష్కలంగా ఉండడంతో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వస్తే నీటిపారుదల చీఫ్ ఇంజినీర్కు అధికారం ఇచ్చామని తెలిపారు.
వడ్ల కొనుగోలులో రాష్ట్రంలోనే ప్రథమస్థానం..
వానకాలం వడ్ల కొనుగోలులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు కృషిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద 43,242 ఎకరాల ఆయకట్టుకు 4.50 టీఎంసీలు, నిజాంసాగర్ కింద సాగవుతున్న 1,98,280 ఎకరాల ఆయకట్టుకు 16.50 టీఎంసీలు, కౌలాస్నాలా, రామడుగు, పోచారం ప్రాజెక్టుల కింద 25,280 ఎకరాలకు 2.832 టీఎంసీలు మొత్తం కలిపి 2,64,832 ఎకరాల్లో యాసంగి పంటల సాగుకు 23.832 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి బోర్డు ఆమోదించిందని వెల్లడించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరు విడుతలుగా డిసెంబర్ 15 నుంచి పదిహేను రోజులు నీటిని విడుదల చేస్తూ.. పది రోజుల విరామం ఇస్తూ 13, ఏప్రిల్ 2022 వరకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా డిసెంబర్ 25 నుంచి నిరంతరాయంగా 18, మే 2022 వరకు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా డిసెంబర్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏడు విడుతల్లో, పోచారం ప్రాజెక్టు ద్వారా జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు తొమ్మిది విడుతలుగా, కౌలాస్నాలా ప్రాజెక్టు ద్వారా డిసెంబర్ 10 నుంచి ఏప్రిల్ 6 వరకు ఏడు విడుతలుగా, రామడుగు ప్రాజెక్టు ద్వారా 27 డిసెంబర్ నుంచి ఏప్రిల్ 28 వరకు ఏడు విడుతలుగా నీటిని విడుదల చేయడానికి ఆమోదించినట్లు వివరించారు.
యాసంగిలో సాగుపై రైతులకు మంత్రి విజ్ఞప్తి..
యాసంగిలో ధాన్యం కొనే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని, రైతులు ఆలోచించి పంటలను సాగుచేయాలని మంత్రి కోరారు. ఒకవేళ వరి సాగు చేస్తే రైస్మిల్లర్లతో ముందుగానే బైబ్యాక్ ఒప్పందాలు చేసుకొని సాగు చేయాలని అన్నారు.
నీటిపారుదల వ్యవస్థ పటిష్టంగా ఉందని, వానకాలంతోపాటు యాసంగిలో కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ పాటిల్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, నిజామాబాద్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ మధుసూదధన్రావు, డిప్యూటీ సీఈ అశోక్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.