ఖలీల్వాడి, డిసెంబర్ 2: నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ కేసులు నియంత్రణలోనే ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేయించుకోవాలని తెలుపుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారంతా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఇప్పటికే భారత్లోకి ప్రవేశించిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్కుల వినియోగం తప్పనిసరి చేసింది. సెంకడ్ వేవ్లో జిల్లా ప్రజలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. థర్డ్వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఉన్నతాధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థర్డ్వేవ్ వస్తే ఇబ్బందులు తప్పవని, ముందస్తు జాగ్రత్తలే మేలంటున్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకుంటే ఒమిక్రాన్ను ఎదుర్కొవచ్చని అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలో 11లక్షల మందికి గాను 10 లక్షల మంది మాత్రమే కరోనా టీకాను తీసుకున్నారు.
మిగితా లక్ష మంది ఇంకా అపోహతో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా రెండు డోసుల టీకా వేసుకుంటే కరోనాను జయించవచ్చునని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో కరోనా వార్డులను సిద్ధం చేశారు. ఆర్మూర్ 130, నిజామాబాద్ 521, బోధన్ 100 బెడ్లు అందుబాటులో ఉంచారు.
మాస్కులు, భౌతికదూరం పాటించాలి
జిల్లా ప్రజలు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా కరోనా టీకాలను వేయించుకోవాలి. ఒమిక్రాన్ వస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
-సుదర్శనం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
ఒమిక్రాన్తో భయం వద్దు
ఒమిక్రాన్తో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. కరోనా టీకాలు వేసుకొని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఎలాంటి లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి
-డాక్టర్ జలగం తిరుపతి రావు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ (ఎండీ ఫిజీషియన్)
మానసిక ఒత్తిడికి గురికావద్దు
కరోనాను జయించాలంటే మానసిక ఒత్తిడికి గురికావద్దు, ఎలాంటి ఆదోళనపడకుండా ఉండాలి. మనోధైర్యమే మనకు రక్షణ. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలి. అలాగే ఎటువంటి దూర ప్రయాణాలు చేయకూడదు. వివాహాలకు వెళ్లకుండా ఉండడం మంచింది.
-డాక్టర్ విశాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్(మానసిక వైద్య నిపుణులు)