న్యూఢిల్లీ: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డిజిటల్ రివల్యూషన్తో మహిళామణులను ఉత్తేజపరిచేందుకు హర్ సర్కిల్ (Her Circle) అనే వేదికను ప్రకటించారు. మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా తొలుత ఏర్పాటైన డిజిటల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా సోదరతత్వాన్ని బలోపేతం చేసేందుకు, పరస్పర సహకారం, మద్దతుతో ఇష్టాగోష్టిగా సంతోషంగా చర్చలు జరిపేందుకు వేదికగా ఉపకరిస్తుంది.
‘ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వేదికగా కలలను సాకారం చేసుకోవడానికి హర్సర్కిల్ రూపొందించింది. భారతీయ మహిళలతో ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలను భాగస్వాములను చేయడానికి ఇది ప్రారంభం. అన్ని సామాజిక వర్గాల మహిళల కలలు, ఆకాంక్షలు, ఆశయాల సాధనకు వేదికగా మారుతుంది’ అని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
హర్ సర్కిల్ ప్రారంభం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ స్పందిస్తూ.. లక్షల మంది మహిళలకు మద్దతు, సంఘీభావం ప్రకటించేందుకు ఈ హర్ సర్కిల్ స్రుష్టిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఒక కుటుంబంలో 11 మంది బాలికల మధ్య కూతురుగా ఎదిగిన తానేం చేయాలో ఆలోచించేదానన్ని చెప్పారు. తన కలలకు అనుగుణంగా తన కూతురు ఈషా అంబానీ నుంచి భేషరతుగా ప్రేమ, విశ్వాసాన్ని పొందానన్నారు. తన కోడలు శ్లోక నుంచి సహానుభూతిని, సహనాన్ని చూశానని తెలిపారు.