బెంగళూర్ : నగరంలోని గాంధీనగర్లో అక్రమంగా నడిపిస్తున్న డ్యాన్స్ బార్పై బుధవారం బెంగళూర్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 64 మంది మహిళలను కాపాడారు. మహిళా రక్షణ విభాగం, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టారు. మూడ్ బార్ అండ్ రెస్టారెంట్లో మహిళా అటెండర్లను అసభ్య దుస్తులు వేయించి డ్యాన్స్ చేయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
వెయిట్రెస్లుగా మహిళలను విధుల్లోకి తీసుకునే బార్ నిర్వాహకులు ఆపై వారితో అర్ధనగ్న దుస్తులు వేయించి కస్టమర్ల ఎదుట డ్యాన్సులు చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. డ్యాన్సర్లపైకి కస్టమర్లను నోట్లు విసిరేందుకు నిర్వాహకులు అనుమతిస్తున్నారని దాడుల్లో వెల్లడైంది. సంబంధిత అధికారుల నుంచి బార్ నిర్వాహకులు సరైన అనుమతులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. దాడుల్లో రూ 1.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 64 మంది మహిళలను ఈ కూపం నుంచి బయటపడేశారు. వీరిలో మహారాష్ట్ర, పంజాబ్కు చెందిన వారు ఎనిమిదేసి మంది ఉండగా, ఢిల్లీకి చెందిన ఆరుగురు మహిళలున్నారు.
ఇక రాజస్ధాన్కు చెందిన మహిళలు 13 మంది కాగా, ముగ్గురు మధ్యప్రదేశ్, ఇద్దరేసి చొప్పున ఉత్తరాఖండ్, బెంగాల్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. యూపీకి చెందిన ఐదుగురు మహిళలు, 17 మంది కర్ణాటకకు చెందిన మహిళలను కాపాడామని చెప్పారు. కాగా బార్ లైసెన్స్ రద్దు చేయాలని బృహత్ బెంగళూర్ మహానగర్ పాలికకు పోలీసులు లేఖ రాశారు. కాపాడిన మహిళలను పునరావాస కేంద్రానికి తరలించగా కస్టమర్లను హెచ్చరించి వదిలేశామని పోలీసులు తెలిపారు.