న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి పోరుకు దూసుకెళ్లింది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ నిఖత్ మరోమారు స్వర్ణ పతకమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్నది. శుక్రవారం జరిగిన మహిళల 52 కిలోల సెమీఫైనల్ బౌట్లో నిఖత్ 4-1 తేడాతో టర్కీ బాక్సర్ బూస్నాజ్పై అద్భుత విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ రజత విజేత అయిన బూస్నాజ్పై తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ ఆది నుంచే తనదైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవైపు పదునైన పంచ్లు సంధిస్తూనే..మరోవైపు డిఫెన్స్తో ఆకట్టుకుంది. ప్రత్యర్థి బాక్సర్ పుంజుకునే ప్రయత్నం చేసినా నిఖత్ ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగింది. ఫైనల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే 2019 తర్వాత మరోమారు స్వర్ణం ఖాతాలో చేరినట్లే. మహిళల 48కిలోల సెమీస్లో నీతు.. హన్న ఒకోటాపై అలవోకగా గెలిచింది. మిగతా బౌట్ల విషయానికొస్తే..అరుంధతి చౌదరి(70కి), పర్విన్(63కి) ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.