న్యూఢిల్లీ, అక్టోబర్ 27: వివిధ కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి ఇటీవల ప్రకటించిన జాతీయ నగదీకరణ పథకం (ఎన్ఎంపీ)లో భాగంగా జాతీయ రహదారుల్ని విక్రయించే ప్రక్రియ మొదలైంది. ఇందు కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తొలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా ఇన్వెస్టర్ల నుంచి రూ.5,100 కోట్ల నిధుల సమీకరణకు ఇష్యూ జారీచేయనుంది. స్టాక్ ఎక్సేంజీలకు సమర్పించిన ఆఫర్ డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఎన్హెచ్ఏఐ ఇన్విట్ ఇష్యూ అక్టోబర్ 29న ప్రారంభమై నవంబర్ 2న ముగుస్తుంది. తెలంగాణసహా వివిధ రాష్ర్టాల్లోని 390 కిలోమీటర్ల జాతీయ రహదారుల్ని ఎన్హెచ్ఏఐ నుంచి ఇన్విట్ సొంతం చేసుకుంటుంది.
పూర్తయిన ఈ రోడ్డు ప్రాజెక్టుల విలువ రూ. 8,000 కోట్లని, వీటికి రూ.2,000 కోట్ల రుణం ఉందని ఎన్హెచ్ఏఐ తెలిపింది. కాగా, ఈ ప్రాజెక్టుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు ఆఫర్ డాక్యుమెంట్ తెలిపింది. నాగపూర్-హైదరాబాద్-బెంగళూరు హైవేలో 139 కిలోమీటర్ల నాగపూర్-ఆదిలాబాద్ మధ్య రహదారి ఇన్విట్ చేతికి వెళుతుంది. ఈ ఇన్విట్ ద్వారా తదుపరి మరిన్ని రౌండ్లలో రూ. 15,000 కోట్ల నిధుల్ని సమీకరించాలన్నది ఎన్హెచ్ఏఐ యోచన. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంఎన్పీలో భాగంగా ఎన్హెచ్ఏఐ మొత్తం 1,500 కిలోమీటర్ల పొడవుగల 32 రోడ్డు ఆస్తుల్ని విక్రయిస్తుంది. ఈ ఆస్తుల్లో కొన్నింటిని ఇన్విట్ ద్వారా సమీకరించిన నిధులతో కొనుగోలు చేయడంతో ఆ రోడ్లు ప్రైవేటు ఇన్వెస్టర్లు వాటాదారులుగా ఉన్న ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల సొంతమవుతాయి.