నాగర్కర్నూల్, నమస్తే తెలంగాణ/దేవరకద్ర రూరల్, మార్చి 13 : యాసంగి పంటలకు ఊరట లభించింది. ఎంజీకేఎల్ఐ నీటిని విడుదల చేయడంతో ఎండిపోతున్న పంటలకు కొత్త ఊపిరి వచ్చింది. ఎంజీకేఎల్ఐ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టు కావడంతో నీటి సమస్య ఏర్పడింది. దీంతో ఎంజీకేఎల్ఐకి కోతిగుండు వద్ద నీటి లభ్యత బాగా తగ్గింది. అందుకే పక్షం రోజుల కిందట నీటి విడుదలను ఆపేశారు. దీంతో కాలువలపై ఆధారపడిన కొన్ని ప్రాంతాల రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఆయకట్టు పరిధిలోని కాలువల కింద ఉన్న ప్రాంతాలకు నీటి విడుదలకు ఆదేశించారు. జొన్నలబొగుడ ద్వారా కిందికి నీటిని విడుదల చేయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దేవరకద్ర మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టుకు నాలుగో విడుతగా నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.