న్యూఢిల్లీ, మే 11: ఎలక్ట్రిక్ వాహన పరిధిని టాటా మోటర్స్ మరింత విస్తరించింది. తాజాగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడల్ను పరిచయం చేసింది. ఈ కారు రూ.17.74 లక్షలు మొదలుకొని రూ.19.24 లక్షల గరిష్ఠ స్థాయిలో లభించనున్నది. 40.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ నెక్సాన్ ఈవీ మ్యాక్స్..నెక్సాన్ ఈవీ కంటే 33 శాతం బ్యాటరీ అధిక కెపాసిటీ కలిగివుండనున్నది. ఒక్కసారి రీచార్జి చేస్తే 437 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు 143 పీఎస్ల శక్తినివ్వనున్నది. రెండు మోడళ్ళలో లభించనున్న ఈ కారులో 30 నూతన ఫీచర్స్ ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫైర్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ చార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. కేవలం 6.5 గంటల్లో కారు బ్యాటరీ పూర్తిగా రీచార్జి అవనున్నది. మరోవైపు, బ్యాటరీ, మోటర్పై సంస్థ ఎనిమిదేండ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ ఇస్తున్నది.