4,30,375కు చేరిన సంఘాల సంఖ్య
నల్లగొండలో గరిష్ఠంగా 28,106
మేడ్చల్లో కనిష్ఠంగా 3,360
ఇప్పటివరకు 55,918 కోట్ల రుణాల పంపిణీ
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళల ఆర్థికాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా పొదుపు, ఉపాధి అవకాశాలపై వారికి అవగాహన కల్పించి స్వయం సహాయక సంఘాల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నది. కొత్త సంఘాలకు రివాల్విండ్ ఫండ్ కింద రూ.15 వేల చొప్పున ఇస్తున్నది. తద్వారా తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా 92 వేల మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) ఏర్పాటయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం ఎస్హెచ్జీల సంఖ్య 4,30,375కు పెరిగింది. వీటిలో 46,44,491 మంది సభ్యులు ఉన్నారు.
నల్లగొండలో అత్యధికం
రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 28,106 ఎస్హెచ్జీలు ఉన్నాయి.
ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ (23,772), ఖమ్మం (25,007) జిల్లాలు నిలిచాయి.
అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 3,360 సంఘాలు ఉన్నాయి.
స్వయం ఉపాధి నిమిత్తం మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలను అందిస్తున్నది.
వీటి సాయంతో వారు వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభించి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకొంటున్నారు.
రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఎస్హెచ్జీలకు రూ.55,918 కోట్ల రుణాలను అందించారు.
స్త్రీనిధి ద్వారా రూ.12,418 కోట్ల రుణాలు ఇచ్చారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 13.10 లక్షల సంఘాలకు రూ.11,750 కోట్ల రుణాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.