హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల యూనిఫారాల రంగును మార్చినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో అందజేసే యూనిఫారాలు వినూత్నంగా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూ నిఫారాలు అందజేస్తుండగా.. స్కూల్ బ్యాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. అవకాశాన్ని బట్టి వచ్చే విద్యాసంవత్సరమే వాటిని అందజేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని, ఖాళీ టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని భాషేతర ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియం బోధనపై విడతలవారీగా చేపట్టిన శిక్షణను సోమవారం సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఆమె ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 33 జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, టీచర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-8 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం అమలు చేయనున్న నేపథ్యంలో అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఆంగ్ల మాధ్యమ బోధనా నైపుణ్యాలను పెంపొందించడం కోసం దీర్ఘకాలిక శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. తొలి విడతలో భాగంగా తొమ్మిది వారాల శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో 19 వేల పైచిలుకు పోస్టులను భర్తీచేయనున్నామని, వీటిలో టీచర్తోపాటు వర్సిటీ ఆచార్యుల పోస్టులు కూడా ఉన్నాయని వెల్లడించారు. టెట్ను ఆఫ్లైన్లోనే నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టెట్ నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చెన్న య్య, మారెడ్డి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శిక్షణపొందే ఉపాధ్యాయులు
ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు : 52,924
ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు : 28,666
మొత్తం : 81,590
సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులు
సెండరీ గ్రేడ్ టీచర్లు : 50,857
ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు : 2,067
ఎస్ఏ గణితం : 8,076
ఎస్ఏ భౌతికశాస్త్రం : 6,609
ఎస్ఏ జీవశాస్త్రం : 5,727
ఎస్ఏ సాంఘికశాస్త్రం : 5,864
శిక్షణ తీరు..
ప్రాథమిక కోర్సులో నాలుగు వారాల శిక్షణ ఉంటుంది. ఒక వారం ముఖాముఖి, 3 వారాలు ఆన్లైన్ శిక్షణ.
రిఫ్రెషర్గా 5 వారాల శిక్షణ ఉంటుంది. ఒక వారం ముఖాముఖి, 4 వారాలు ఆన్లైన్ శిక్షణ.
ప్రాథమిక స్థాయిలో శిక్షణ..
జిల్లాకు ముగ్గురు చొప్పున 33 జిల్లాలకు 99 మంది రిసోర్స్పర్సన్లకు శిక్షణ ఇస్తారు.
జిల్లాస్థాయి మెంటార్లుగా జిల్లాకు 30 మంది చొప్పున 990 మందికి శిక్షణ ఇస్తారు.
ప్రాథమిక తరగతుల్లోని టీచర్లను 3 నుంచి 5 బ్యాచ్లుగా విభజించి 52,924 మందికి శిక్షణ ఇస్తారు.
సెకండరీ స్థాయిలో
సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున 4 నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు మొత్తంగా 264 మంది రిసోర్స్పర్సన్లకు శిక్షణ ఇస్తారు.
జిల్లాస్థాయి మెంటార్లుగా నాలుగు నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో గణితం 15, భౌతికశాస్త్రం 12, జీవశాస్త్రం 12, సోషల్కు 12 మంది చొప్పున ఒక్కో జిల్లాలో 51 మందిని నియమిస్తారు.
వీరు నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టు టీచర్లలైన గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సోషల్స్టడీస్లోని 28,666 మంది టీచర్లకు శిక్షణ ఇస్తారు.