హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి 4,794 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో ప్రకటించారు. వీటిలో బోధన పోస్టులు 2,020 ఉండగా, బోధనేతర పోస్టులు 2,774 ఉన్నాయి. దీంతో యూనివర్సిటీలు పటిష్ఠం కానున్నాయి. గతంలో ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే కమిటీ వేసి రిక్రూట్మెంట్ చేపట్టేది. ఆ విధానాన్ని మార్చి, అన్ని యూనివర్సిటీలకు ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా నియామకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. కాగా, రాష్ట్రంలో 11 వర్సిటీలు ఉండగా, 1,061 బోధన సిబ్బందిని నియమించుకొనేందుకు గతంలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పలు కారణాలతో ఆ పోస్టులు భర్తీ కాలేదు. తాజాగా వీటి సంఖ్యను 2,020కు పెంచారు. వీటిల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇవే కాకుండా మరో 2,774 బోధనేతర సిబ్బంది పోస్టులను సైతం భర్తీచేయనున్నారు.