తాండూర్ : తాండూర్ మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువు తీరాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ (Grama Panchayats) కార్యదర్శులు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ( Sarpanch ) , ఉప సర్పంచులు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో గ్రామ పంచాయతీలు సందడిగా మారాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తులు తమపై నమ్మకంతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.