న్యూఢిల్లీ, మార్చి 29: నూతన ఆర్థిక సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి మొదలవుతున్నది. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త నిర్ణయాలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయం పన్ను (ఐటీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిలో కొన్ని భారమవుతుంటే, మరికొన్ని ఊరటనిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి పరిశీలిస్తే..
క్రిప్టో పన్ను
దేశంలో క్రిప్టో ఆస్తుల పన్ను విధానం అమల్లోకి రానున్నది. 30 శాతం పన్ను, 1 శాతం టీడీఎస్ వేయనున్నారు. నష్టాలతో సంబంధం లేకుండా క్రిప్టో కరెన్సీల్లో వచ్చే లాభాలపై పన్ను చెల్లించాల్సిందే.
ఐటీ రిటర్నులు
ఐటీ రిటర్నుల్లో తప్పులు దొర్లితే పన్ను చెల్లింపుదారులు అప్డేట్ చేసిన రిటర్నును దాఖలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండేండ్లలోపు ఈ వెసులుబాటు ఉంటుంది.
ఎన్పీఎస్ కోతలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులూ.. తమ కనీస వేతనం, డీఏలో 14 శాతం వరకు సంస్థ ద్వారా ఎన్పీఎస్ నిధి కోసం సెక్షన్ 80సీసీడీ(2) కింద కోతలకు క్లెయిం చేసుకోవచ్చు.
పీఎఫ్ ఖాతాపై పన్ను
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీ నిబంధన (25వ సవరణ) 2021ను అమల్లోకి తెస్తున్నది. దీంతో ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్లే మొత్తాల్లో రూ.2.5 లక్షల వరకే పన్నుండదు. ఇది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది.
కరోనా చికిత్సకు..
ఇక కరోనా చికిత్సకయ్యే ఖర్చులపై పన్ను మినహాయింపును పొందవచ్చు. అలాగే కరోనాతో ఎవరైనా మరణిస్తే.. ఏడాదిలోగా వారి కుటుంబ సభ్యులు పొందే సొమ్ముపైనా పన్నులుండవు. రూ.10 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఇక అంగవైకల్యంతో బాధపడుతున్నవారి తల్లిదండ్రులు, సంరక్షకులు.. బాధిత వ్యక్తి కోసం తీసుకునే బీమాపై పన్ను చెల్లించనక్కర్లేదు.
జీఎస్టీ మార్పు
పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు.. రూ.20 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులను బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ను తీయాలని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా రూ.50 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపారులకే ఇది వర్తించేది. దీంతో ఇన్వాయిస్ లేకపోతే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. పైగా జరిమానాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పోస్టాఫీసు పథకాలు
టైం డిపాజిట్ అకౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, నెలసరి ఆదాయ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలంటే సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతా తప్పనిసరి. స్మాల్ సేవింగ్స్లో డిపాజిట్ చేసిన మొత్తాలపై అందుకునే వడ్డీ ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ అకౌంట్, పోస్టాఫీస్ బ్యాంక్ అకౌంట్లలోనే జమవుతుంది. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ ఖాతాతో పోస్టాఫీస్ ఖాతా లేదా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేయాల్సిందే.
బ్యాంకుల్లో..
ఏప్రిల్ 1 నుంచి పాజిటివ్ పే సిస్టమ్ను అమలు చేస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో వెరిఫికేషన్ లేకుండా పాజిటివ్ పే సిస్టమ్ కింద చెక్ పేమెంట్లు కుదరవు. రూ.10 లక్షలు ఆపై మొత్తాల చెక్కులకు ఈ నిబంధన తప్పనిసరి. ఇక సేవింగ్స్ ఖాతాల్లో నెలసరి కనీస నగదు పరిమితిని రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచుతున్నది యాక్సిస్ బ్యాంక్.
పన్ను ప్రోత్సాహం లేదు
సామాన్యుడి సొంతింటి కల సాకారం మరింత కష్టతరం కానున్నది. మొదటిసారి ఇల్లు కొంటున్నవారికి సెక్షన్ 80ఈఈఏ కింద ఇస్తున్న పన్ను మినహాయింపు ప్రోత్సాహం ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోనున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా మధ్యతరగతివారిపై ఇంటి కొనుగోలు భారం పెరిగిపోనున్నది.