ముంబై: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే మజాకా! యుద్ధాన్ని తలపించే దాయాదుల సమరాన్ని వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చకోరా పక్షుల్లా ఎదురుచూసే సందర్భాలు ఎన్నో. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో భారత్, పాక్ సమరం రికార్డులు తిరుగరాసింది. గత నెల 24న దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించారట. ఈ ఆసక్తికర పోరుకు ఏకంగా 16 కోట్ల 70 లక్షల వ్యూస్ లభించినట్లు ప్రసారదారు స్టార్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో అత్యధిక వీక్షణలు కల్గిన మ్యాచ్గా ఇది రికార్డుల్లోకెక్కింది. గత టీ20 ప్రపంచకప్(2016)లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్కు 13 కోట్ల వ్యూస్ దక్కడం ఇప్పటివరకు రికార్డు. ప్రస్తుత టోర్నీ విషయానికొస్తే..క్వాలిఫయర్స్, సూపర్-12 మ్యాచ్లు కలిపి పోయిన వారం వరకు 23 కోట్ల వ్యూస్ లభించినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే ఓవైపు మెగాటోర్నీ నుంచి భారత్ నిష్క్రమించగా, పాకిస్థాన్ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. టీ20 వరల్డ్కప్ లీగ్ దశలోనే భారత్ దూరమవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచినా..క్రికెట్పై ఆసక్తి తగ్గలేదని వ్యూవర్షిప్ నిరూపించిందని స్టార్ ప్రతినిధి అన్నారు.