సిటీబ్యూరో, డిసెంబరు 3 (నమస్తే తెలంగాణ): నార్సింగి పోలీసుల కస్టడీలో ఉన్న కిట్టీ పార్టీల కిలేడి శిల్పా చౌదరి విచారణకు సహకరించడం లేదని తెలిసింది. శుక్రవారం చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న ఆమెను మహిళా పోలీసు అధికారులు నేరుగా నార్సింగి తీసుకువచ్చారు. అక్కడ సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. అయితే శిల్పా చౌదరి సరైన జవాబులు ఇవ్వకుండా దాటవేసిందని సమాచారం. గట్టిగా ప్రశ్నిస్తే కన్నీరు పెట్టిందని విశ్వసనీయంగా తెలిసింది. అయితే కమీషన్ తీసుకొని.. బడా వ్యాపారులు, సెలబ్రిటీల నల్లధనాన్ని మార్చానని చెప్పింది. మరో వైపు తన సినిమాలు, ఇతర వ్యాపారాలకు సంబంధించి అప్పులు తీసుకున్నానని, వాటికి వడ్డీలు కడుతున్నానని వివరించింది. పోలీసులు మాత్రం కస్టడీ విచారణ కొనసాగుతున్నదని, కీలక సమాచారం దొరకలేదని చెబుతున్నారు. తాజాగా శిల్పా చౌదరి నిర్మించిన సహేరి చిత్రం హీరో హర్ష్ శుక్రవారం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శిల్ప తన వద్ద రూ. 3 కోట్లు తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.