హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆదరణ ముసుగులో అవమానించడం, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాషాయ దళపతుల నైజమని మరోసారి తేటతెల్లమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనలో బీజేపీ దళిత కార్యకర్త కు ఘోర అవమానం జరిగింది. దళిత కార్యక ర్త ఇంట్లో అమిత్షా భోజనం చేస్తారని విస్తృత ప్రచారం కల్పించారు. కానీ, ఆ కార్యకర్త ఇం ట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా వివ క్ష చూపారు. ఇంట్లో చేసిన చాయ్ కూడా రుచి చూడలేదు. బయట నుంచి బ్లాక్ టీ తెప్పించుకొని తాగారు. దళితుల పట్ల బీజేపీ నేతల కపట ప్రేమకు ఆదివారం సికింద్రాబాద్లో జరిగిన ఘటనే నిదర్శనం. అమిత్ షా తీరుపై నెటిజన్లు, దళిత మేధావులు సోషల్మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడులో ఆదివారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా తరుణ్చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి సికింద్రాబాద్ సాంబమూర్తినగర్లోని బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. బీజేపీ దళిత కార్యకర్త ఇంట్లో అమిత్షా భోజనం చేస్తారని, ఇరానీ చాయ్ రుచి చూస్తారని మూడు రోజులుగా జోరుగా ప్రచారం చేసుకున్నారు. కానీ, సత్యనారాయణ ఇంట్లో కనీసం మంచినీళ్లు కూడా ముట్టలేదు. వెంట తీసుకెళ్లిన వాటర్ బాటిళ్ల నీళ్లను తాగారు. బయటి నుంచి తెప్పించిన బ్లాక్టీ తాగి బయటపడ్డారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం అనంతరం ఇప్పటికీ దళితుల ఇంటికి వెళ్లడం గొప్పగా బీజేపీ చెప్పుకోవడం సిగ్గుచేటంటూ సోషల్మీడియాలో నెటిజన్లు చురకలు అంటించారు.
అమిత్షా, బీజేపీ నేతల రాజకీయాలపై నెటిజన్లు, దళిత మేధావులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికీ దళితుడి ఇంటికి వెళ్లడం, భోజనం చేయడం, నీళ్లు తాగడం వంటి అంశాలను బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటూ సమసిపోతున్న వివక్షను మరింతగా తరచి చూపుతున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ పొలిటికల్ గేమ్లో అమాయక దళితవర్గాలను పావులుగా మార్చుతున్నారని దళిత మేధావులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత జన అభ్యున్నతిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, ఇలాంటి జిమ్మిక్కులు మానుకోవాలని సోషల్మీడియాలో హోరెత్తిస్తున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న దళితబంధు వంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి బీజేపీ సర్కారు తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సూచిస్తున్నారు.
ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి వెళ్లడం, ఇలాంటి జిమ్మికులు చేయడం బీజేపీ నేతలకు పరిపాటిగానే మారింది. అందులో అమిత్షా మినహాయింపేమీ కాదని మరోసారి రుజువైంది. గతంలో తెలంగాణ పర్యటనకు అమిత్షా వచ్చినప్పుడు తెరాట్పల్లిలో దళితుడి ఇంట్లో భోజనం చేస్తానని ప్రకటించారు. కానీ, సమీపంలోని కమ్మగూడెం సమీపంలోని ఓ అగ్రనాయకుడి మామిడితోటల్లో వంటలు వండించుకొని, వాటినే దళితుడి ఇంటికి తీసుకెళ్లి భోజనం చేసి కించపర్చారు. పెద్దదేవులపల్లిలోనూ ఇదే తీరుగా వ్యవహరించారు. అన్నపూర్ణ మెస్ నుంచి భోజనం తెప్పించుకొని దళితుడి ఇంట్లో భోజనం చేసినటు ఫోజులు కొట్టారు. అమిత్షా ఒక్కరే కాదు యూపీ సీఎం ఆదిత్యనాథ్, అనేక మంది కేంద్రమంత్రులు కూడా ఇదే తరహాలో దళితులను అవమానించారు.