న్యూఢిల్లీ, జనవరి 23: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేటు వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘చేయగలను, చేస్తాను’ అనే నేతాజీ స్ఫూర్తిని దేశ ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ.. స్వాతంత్రోద్యమంలో అనేక మంది గొప్ప వ్యక్తుల భాగస్వామ్యాన్ని చెరిపే ప్రయత్నాలు జరిగాయని, ఇప్పడు ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నేతాజీ జయంతితోపాటే రిపబ్లిక్ వేడుకలు కూడా మొదలయ్యాయి.
గుజరాత్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు పురస్కారం
‘సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2022’ను కేంద్రం ఆదివారం ప్రకటించింది. సంస్థల క్యాటగిరీలో గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వ్యక్తుల క్యాటగిరీలో సిక్కిం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వినోద్ శర్మ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఏటా నేతాజీ రిసెర్చ్ బ్యూరో అందజేసే ‘నేతాజీ అవార్డు’ను ఈ ఏడాది జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అందుకున్నారు.
పత్రాలు బహిర్గతం చేస్తాం: తైవాన్
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అప్పటి తమ జాతీయ ధ్రువపత్రాలను బహిర్గతం చేస్తామని తైవాన్ ప్రకటించింది. 1940లో తైవాన్ జపాన్ అధీనంలో ఉంది. నేతాజీ చివరి రోజుల్లో తైవాన్లోనే ఉన్నారని, 1945లో జరిగిన విమానం ప్రమాదంలో అక్కడే మరణించి ఉంటారని భారత్ భావిస్తున్నది.