కాట్మాండు: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద(Nepal Floods)ల్లో మృతిచెందిన వారి సంఖ్య 469కి చేరుకున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. వరదల వల్ల సుమారు 1500 మంది ఆచూకీ లేనట్లు కూడా తెలిపారు. ఇక మరో వైపు చైనా వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ దిగువ ప్రాంతాలకు మరింత భీకర వరదలు సంభవించే అవకాశాలు ఉన్నట్లు డ్రాగన్ దేశం హెచ్చరించింది. తాజా వరదల్లో సుమారు 178 మంది భారతీయులు గల్లంతు అయినట్లు నేపాల్ అధికారులు చెబుతున్నారు. 11 మందిని రెస్క్యూ చేశారు. విదేశీ పర్యాటకులతో పాటు మానస సరోవర యాత్రకు వెళ్లిన యాత్రికులు ఎక్కువ సంఖ్యలో మిస్ అయినట్లు తెలుస్తోంది.
టిబెట్-నేపాల్ బోర్డర్ వద్ద లెవల్-4 హెచ్చరిక జారీ చేసింది చైనా. బుధవారం నాటి మట్టిచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాత్కాలిక సరస్సులు ఏర్పడినట్లు చైనా చెప్పింది. రెండు నదుల సంగమం వద్ద ఇలా జరిగినట్లు ఆ దేశం పేర్కొన్నది. అయితే ఏ క్షణమైనా ఆ తాత్కాలిక సరస్సు ఉప్పొంగే అవకాశాలు ఉన్నట్లు చైనా అభిప్రాయపడింది. టిబెట్ ఆటోనమస్ ప్రాంతంలో చైనా జలవనరుల మంత్రిత్వశాఖ ఎమర్జెన్సీ ఆదేశాలు జారీ చేసింది. చోచెన్ ఖోలా, పెరుపా సాంగో నదుల కలయిక వద్ద భారీగా బేరియర్ లేక్ ఏర్పడినట్లు చైనా పేర్కొన్నది. ఈ రెండు నదులూ టిబెట్లో ఉద్భవిస్తాయి. ఇవి నేపాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి బోటే కోసిగా ఈ నదులు రూపాంతరం చెందుతాయి.
అయితే ఈ రెండు నదుల సంగమం వద్ద సుమారు రెండు మిలియన్ల క్యూబిక్ మీటర్ల మేర నీరు ఉన్నట్లు చైనా చెబుతోంది. దీంతో పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు చైనా హెచ్చరించింది. ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు. ఆ తాత్కాలిక సరస్సు వల్ల రెస్క్యూ చర్యలు ఆలస్యం అవుతున్నాయి. ఎప్పుడు ఆ సరస్సు ఉప్పొంగుతుందో అన్న భయం నెలకొన్నది. బురదతో కొట్టుకువచ్చిన బండరాళ్లు అడ్డుపడడంతో.. రెండు నదుల సంగమం వద్ద భారీగా ఓ సరస్సు ఏర్పడింది. దీని వల్ల ముప్పు ఉందని భావిస్తున్నారు.