హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా కరోనాతో సహజీవనం చేస్తున్నాం. రెండు దశలలో ఆ మహమ్మారి సృష్టించిన భయోత్పాతాన్ని కళ్లారా చూశాం. అది సోకితే ఎంత ప్రమాదమో తెలుసుకొన్నాం. దాని బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో నేర్చుకొన్నాం.. కానీ, వైరస్ ప్రభావం కొద్దిగా తగ్గగానే పోలోమని బయటకు వచ్చేస్తున్నాం. దీంతో ఎవరిలోనైనా స్వల్ప లక్షణాలు ఉన్నా.. అవి మళ్లీ బయటకు వచ్చేస్తున్నాయి. ఒకరినుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నాయి.
55 శాతం మంది మాస్కులపై నిర్లక్ష్యం
ఎలాంటి వేరియంట్నైనా మాస్క్తో నియంత్రించవచ్చని, మాస్క్ వజ్రాయుధం వంటిదని ప్రభుత్వం రెండేండ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. అయినా ప్రజలు మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్లో సగటున కేవలం 45 శాతం మంది మాత్రమే పూర్తి స్థాయిలో మాస్కులు ధరిస్తున్నారట. అంటే.. 55 శాతం మంది మాస్క్ పెట్టుకోకపోవడం లేదా పాక్షికంగా ధరిస్తున్నారు.
ఇందులో పురుషులతో పోల్చితే మహిళలే జాగ్రత్తగా ఉంటున్నట్టు తేలింది. మహిళలు మాస్క్ సంపూర్ణంగా ధరిస్తున్నట్టు వెల్లడైంది. డెల్టా వేరియంట్ సోకినవారిలో దాదాపు 70% మందిలో, ఒమిక్రాన్ బారినపడిన 90%మందిలో అసలు లక్షణాలే కనిపించడం లేదు. మాస్కులు ధరించని 55% మందిలో ఎందరు కరోనా రోగులు ఉన్నారో.. ఎంత మందికి వ్యాపింపజేస్తున్నారో ఊహించడం కష్టం.
అమెరికా అనుభవమే పెద్ద పాఠం
అమెరికాలో దాదాపు అన్ని దేశాల కన్నా ముందే వ్యాక్సినేషన్ పూర్తయింది. టీకా రక్షణ సరిపోతుందని.. ప్రజలు మాస్క్ లేకుండా స్వేచ్ఛగా విహరించవచ్చని స్వయంగా ఆ దేశాధ్యక్షుడే ప్రకటించారు. అప్పటి నుంచి అక్కడి ప్రజల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నా వారు మాత్రం మాస్కులను విస్మరించారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. అక్కడ రోజుకు 10 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మరణించేవారి సంఖ్య తక్కువగానే ఉన్నా.. వైద్య వ్యవస్థపై మోయలేనంత భారం పడుతున్నది. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించి ఉంటే ఆ దేశంలో కేసుల సంఖ్య సగానికి తగ్గేదని స్వయంగా అక్కడి వైద్యనిపుణులే చెప్తున్నారు. అగ్రరాజ్యాన్ని చూసైనా మనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఫంక్షన్లు, పండుగలతో ప్రమాదమే..
సంక్రాంతి పండుగ రాబోతున్నది. మూఢాలు వెళ్లిన తర్వాత ఫంక్షన్లు కూడా మొదలవుతాయి. ఆ తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జాతరలు మొదలవుతున్నాయి. రాజకీయ కార్యకలాపాలు కూడా పెరిగిపోతున్నాయి. వీటితో పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలో వీటికి హాజరు కావాలా? వద్దా? ప్రయాణాలు చేయాలా? వద్దా? అనేది మన చేతుల్లోనే ఉన్నది. చివరికి సినిమాకు వెళ్లాలా? వద్దా? అనేది కూడా మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. విపత్తు ముంచుకొస్తున్న వేళ అనవసరంగా గుమిగూడితే ఏం జరుగుతుందో మనం మొదటి, రెండో వేవ్లో చూశాం.
కఠిన ఆంక్షలతో లక్షల మంది జీవితాలు ఆగం
రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి కఠిన ఆంక్షలు లక్షల కుటుంబాలపై ఆర్థికంగా పెను ప్రభావం చూపిస్తాయి. ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో కూలీలు, చిరు వ్యాపారులు, హోటళ్ల యజమానులు ఆర్థికంగా చితికిపోయారు. మరోసారి అలాంటి ఆంక్షలు పెడితే ఆయా కుటుంబాలు జీవితంలో కోలుకోలేని పరిస్థితి నెలకొంటుంది. ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు రావు.
సకల ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
ఫస్ట్, సెకండ్ వేవ్లో ఎదురైన అనుభవాలతో ప్రభుత్వం మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సకల ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 23,390 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వీటితోపాటు మాస్కులు, పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు సిద్ధంగా ఉంచింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు కోట్ల టెస్టింగ్ కిట్లను, కోటి ఐసొలేషన్ కిట్లను సిద్ధం చేస్తున్నారు. పీహెచ్సీ స్థాయిలోనే కరోనా కట్టడికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలకు దాదాపు 75 లక్షల టెస్టింగ్ కిట్లను సరఫరా చేశారు. సుమారు 20 లక్షల హోం ఐసొలేషన్ కిట్లను పీహెచ్సీ స్థాయి వరకు పంపిణీ చేసి సిద్ధంగా ఉంచారు. సెంకండ్ వేవ్లో కరోనా కట్టడితో కీలకంగా పనిచేయడంతోపాటే దేశానికే ఆదర్శంగా నిలిచిన జ్వర సర్వేను అవసరమైతే నిర్వహించేందుకు వైద్యసిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వైద్య సిబ్బందికి నాలుగు వారాలపాటు సెలవులను రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఫీవర్/కొవిడ్ క్లినిక్లను ప్రారంభించింది. ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించింది.
20 వరకు కొవిడ్ ఆంక్షలు పొడిగింపు
రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం ఈ నెల 20వ తేదీవరకు పొడిగించింది. కొత్త కేసులు పెరుగుతున్నందున ఆంక్షలను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. 20 వరకు మత, రాజకీయ, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలుసహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై నిషేధం కొనసాగనున్నది. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్, సంస్థల నిర్వహణ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల సిబ్బంది మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. కార్యాలయాలను తరచూ శానిటైజ్ చేయాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి. పాఠశాలల్లో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించడంతోపాటు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు ధరించనివారికి రూ.1,000 జరిమానా విధిస్తారు.
డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సర్వే ప్రకారం
హైదరాబాద్లో మాస్క్ ధరిస్తున్నవారు 45% (సగటు)
మహిళలు 44.39%
పురుషులు 39%