హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించిన నీట్-యూజీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థి కే మృణాల్ ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకొన్నాడు. 720 మార్కులకు గాను 720 మార్కులను సాధించాడు. మృణాల్తో పాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక సంయుక్తంగా టాప్ ర్యాంకు సాధించారు. ఈ ముగ్గురికీ 720/720 మార్కులు వచ్చాయి. నీట్ పరీక్ష సెప్టెంబర్ 12న జరిగింది. పరీక్షకు 16.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 95శాతం మంది పరీక్ష రాశారు. హైదరాబాద్కే చెందిన ఖండవల్లి శశాంక్ జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. నీట్ యూజీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ర్యాంకు కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు, ఈ మెయిల్కు పంపించింది. తర్వాత ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
తెలంగాణ నుంచి ర్యాంకర్లు వారే
పేరు ర్యాంక్
మృణాల్ కే 1
ఖండవల్లి శశాంక్ 5
కాస లహరి 30
ఈమని శ్రీనిజ 38
కార్తిక్ 53
శ్రీనిహారిక 56
పసుపునూరి శరణ్య 60
లాస్య 75
సింధూ రెడ్డి 116
పవన్ కల్యాణ్ 129
సీహెచ్ వైష్ణవి 143
ఇంజనీర్ అవ్వాలనుకుని
మా కుటుంబంలో మొదట డాక్టర్ అయ్యే వ్యక్తిని నేనే. రోజుకు ఇన్ని గంటలు చదవాలని పెట్టుకోలేదు. కానీ కష్టపడి చదివాను. టైం టేబుల్ ప్రకారం, లేచిన మొదటి నిమిషం నుంచే ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నా. 45 నిమిషాలు చదివి బ్రేక్ తీసుకునేవాడిని. సొంతంగా ప్రిపేరయ్యేవాడిని. చిన్నప్పుడు ఇంజనీర్ కావాలని ఉండేది. తర్వాత ఆలోచన మారింది. ఇప్పుడు ఆర్మీలో వైద్యుడిగా సేవలందించాలని ఉంది.
– మృణాల్
న్యూరో సర్జన్ లక్ష్యం
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పుట్టిపెరిగా. పాఠశాల విద్య కర్నూలులో సాగింది. అమ్మ సుధ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్. చదువు విషయంలో మా పేరెంట్స్ నాపై ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. న్యూరో సర్జన్ కావాలన్నది నా ఆశయం. మంచి ర్యాంకు వస్తే చాలనుకున్నాను కాని 5వ ర్యాంకు వస్తుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది.
– శశాంక్ ఖండవల్లి