తెలుగు చిత్ర పరిశ్రమలో వ్యక్తిగా వచ్చి శక్తిగా ఎదిగారు దిల్ రాజు. సినీ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 50కి పైగా చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. నాగ చైతన్య హీరోగా సోదరుడు శిరీష్తో కలిసి ఆయన నిర్మించిన కొత్త చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను, ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితులను దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమాను మీ జీవితంతో పోల్చుకున్నారెందుకు?
మనమంతా ఎప్పుడో ఒక సందర్భంలో ఇతరుల సాయం పొందిన వాళ్లమే. జీవితం కొన్నేళ్లు సాగాక వాళ్లందరినీ మర్చిపోతాం. నా జీవితంలో చదువుకునేప్పుడు, ఆటోమొబైల్ వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు, నిర్మాతగా ఎదిగే క్రమం దాకా ఎంతోమంది తోడ్పాటు అందించి ఉంటారు. వాళ్లందరినీ కలిసి థాంక్స్ చెప్పిన రోజు మా భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా అనిపించింది. ఈ కథ విన్నాక నాకు సాయం చేసిన చాలా మందిని కలిశాను.
హీరో జీవితంలోని వివిధ దశలతో కథను చెప్పడానికి కారణం?
నాలుగేళ్ల క్రితం బీవీఎస్ రవి ఈ కథ చెప్పినప్పుడు ఇదే అనుభూతికి లోనయ్యాను. ఒక సాధారణ కుర్రాడు గొప్ప స్థాయికి వెళ్తాడు. అయితే విజయం సాధించాక అంతా తనదే ఘనత అనుకుంటాడు. అది నిజం కాదు అతనికి సాయం చేసిన వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లకు థాంక్స్ చెప్పాలని ప్రయత్నించడమే ఈ సినిమా.
దర్శకుడిగా విక్రమ్ కె కుమార్ పనితనం గురించి ఏం చెబుతారు?
విక్రమ్ చేసిన ‘మనం’, ‘13బీ’, ‘ఇష్క్’ సినిమాలు సూపర్ హిట్స్. అలాగే ‘24’, ‘హలో’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు కొత్తగా ఉంటాయి గానీ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. అతని సినిమాలు చూసి ఫ్లస్లూ మైనస్లూ చెప్పాను. ఈ సినిమాను తన ైస్టెల్లోకి మార్చుకుని అందంగా తెరకెక్కించాడు.
నాగ చైతన్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది?
మూడు గెటప్స్లో నటించడం మామూలు విషయం కాదు. కాలేజ్ సీన్స్ కోసం సన్నగా మారాడు, టీనేజ్ పోర్షన్స్లో గడ్డం పెంచి కొత్త లుక్లోకి వచ్చాడు. అలాగే బిజినెస్మెన్గా డీసెంట్ గెటప్ మార్చాడు. ఇలా మూడు వేరియేషన్స్లో ఆయన పాత్ర సాగుతుంది. దర్శకుడు విక్రమ్ ఆలోచనలను చైతూ బాగా అర్థం చేసుకున్నాడు.
థియేటర్ల దగ్గర పరిస్థితి ఆశించినట్లు లేదు కదా
జనం కోవిడ్ టైమ్లో పూర్తిగా ఓటీటీలకే పరిమితమయ్యారు. కొత్త తరహా సినిమాలకు, వెబ్ సిరీస్లకూ అలవాటుపడ్డారు. దాంతో ఇప్పుడు థియేటర్లకు వాళ్లను ఆకర్షించడం కష్టమవుతున్నది. టికెట్ రేట్లు పెరగడం సామాన్యులకు భారమవుతున్నది. ఈ కారణాలతో థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోయింది. ఇక్కడే కాదు బాలీవుడ్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. నేను హిందీలో నిర్మించిన ‘హిట్’ చిత్రానికి మామూలు రోజుల్లో అయితే ఓపెనింగ్స్ 15 కోట్లు రావాలి కానీ 6,7 కోట్ల రూపాయలే వచ్చాయి.. అలాగే ‘జెర్సీ’ హిందీ రీమేక్ మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక 30 కోట్ల రూపాయల లాభాలు ఉంటాయనుకున్నాం. కానీ పాండమిక్ వచ్చి పడింది. దీంతో ఆదాయం రాకపోగా 3,4 కోట్ల రూపాయల నష్టాలు భరించాల్సి వచ్చింది.
ఇటీవలి నిర్మాతల మీటింగ్లో ఏ అంశాలు చర్చించారు?
మనం ప్రేక్షకులకు ఎలాంటి సినిమా చూపిస్తున్నాం అనేది ప్రధానంగా చర్చించాం. కంటెంట్ మీద ఇంకా ఫోకస్ చేయాలని అనుకున్నాం. ఓటీటీ విడుదలకు పరిమితి పెట్టుకోవడం మరో కీలకాంశం. నేను గతంలో ఓకే అనుకున్న ఒక పది స్క్రిప్టులు పక్కన పెట్టేశాను, అలాగే షూటింగ్ చేస్తున్న రెండు ప్రాజెక్టులు ఆపేశా.