న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన మెగా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 12 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఉదయం 7 గంటలకు వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు మొత్తం 11,99,37,641 మోతాదులను 17,37,539 సెషన్లలో వేసినట్లు తెలిపింది. ఇందులో 91,05,429 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు వేయగా.. మరో 56,70,818 మందికి రెండో డోసు వేసినట్లు చెప్పింది.
అలాగే ఫ్రంట్లైన్ కార్మికుల్లో 1,11,44,069 మందికి ఫస్ట్ డోస్, 54,08,572 మందికి సెకండ్ డోస్ వేసినట్లు తెలిపింది. 60 ఏళ్లు పైబడి లబ్ధిదారుల్లో 4,49,35,011 మందికి మొదటి డోసు, 34,88,257 రెండో మోతాదును అందించినట్లు వివరించింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి 3,92,23,975 మొదటి మోతాదు.. మరో 9,61,510 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు ఇచ్చినట్లు చెప్పింది. గడిచిన 24 గంటల్లో ఒకే రోజు 30 లక్షలకుపైగా డోసులు వేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఈ నెల 16న టీకా డ్రైవ్ 91వ రోజుకు చేరగా.. ఒకే రోజు 30,04,544 వ్యాక్సిన్ మోతాదులను 37,817 సెషన్లలో వేసినట్లు చెప్పింది. 22,96,008 మంది లబ్ధిదారులకు తొలి డోస్, 7,08,536 మందికి రెండో డోస్ వేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 2,34,692 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్తో సహా పది రాష్ట్రాల్లో కొత్త కేసుల్లో 79.32 శాతం నమోదయ్యాయి.
మహారాష్ట్రలో రోజువారీ కేసులు అత్యధికంగా నిన్న 63,729 కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో రికార్డు స్థాయిలో 27,360 కేసులు, ఢిల్లీలో 19,486 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740కు చేరింది. గత 24 గంటల్లో మొత్తం 1,23,354 కోలుకోగా.. ఇప్పటి వరకు 1,26,71,220 మంది డిశ్చార్జి అయ్యారు. జాతీయ రికవరీ రేటు 87.23 శాతానికి చేరింది.
కొత్తగా దేశంలో 1,341 మంది మృతి చెందగా.. ఇందులో పది రాష్ట్రాల్లోనే 85.83శాతం మరణాలు ఉన్నాయి. తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క మరణాన్ని సైతం నివేదించలేదు. వీటిలో లఢఖ్, త్రిపుర, సిక్కిం, మిజోరాం, మణిపూర్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ప్రదేశ్ ఉన్నట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..