హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కోరితే టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పిస్తామని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) చైర్మన్ యోగేశ్ సింగ్ తమకు చెప్పినట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు తెలిపారు. శుక్రవారం వారు ఢిల్లీలో ఎన్సీటీఈ చైర్మన్ యోగేశ్సింగ్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
2010 కన్నా ముందు నియామకమైన 1-5 తరగతులు బోధించే టీచర్లు పదోన్నతి పొందేందుకు టెట్ నుంచి మినహాయింపునిస్తామని హామీనిచ్చినట్టు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లకు పదోన్నతులకు సంబంధించి విద్యాహక్కు చట్టంలోని మార్గదర్శకాలను సవరిస్తామని చెప్పినట్టు వారు పేర్కొన్నారు. ఇదిలావుండగా, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ఎంల పదోన్నతికి టెట్ అవసరంలేదని ఎన్సీటీఈ సభ్యదర్శి కేషాంగ్ వై షెర్పా స్పష్టం చేసినట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ), జాక్టో నేతలు తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలోని ఉపాధ్యాయల సంఘాల ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో ఎస్సీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ యోగేశ్సింగ్, సభ్యకార్యదర్శి కేషాంగ్ వై షెర్పాలను వేర్వేరుగా కలిశారు. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన టీచర్లు అదే స్థాయిలో పదోన్నతి పొందేందుకు టెట్ అవసరం లేదని కేషాంగ్ వై షెర్పా వివరణ ఇచ్చినట్టు నేతలు తెలిపారు.