అగ్ర కథానాయిక నయనతార సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సరోగసీ నిబంధనల్ని అతిక్రమించి నయనతార-విఘ్నేష్శివన్ కవలలకు తల్లిదండ్రులయ్యారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహా రంపై తమిళనాడు ప్రభుత్వం విచారణ జరుపుతున్నది. సరోగసీ నియంత్రణ చట్టం 2021 ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాల తర్వాతే దంపతులు సరోగసీ విధానంలో తల్లిదండ్రులు కావడానికి అర్హులవుతారు.
దాంతో పాటు అద్దె గర్భానికి అంగీకరించే మహిళ.. దంపతులకు దగ్గరి బంధువు అయి ఉండాలనే నిబంధన కూడా ఉంది. నయనతార-విఘ్నేష్శివన్ దంపతులు జూన్లో పెళ్లి చేసుకున్నారు. దీంతో నాలుగునెలల్లోనే వాళ్లు సరోగసీ ద్వారా పేరెంట్స్ కావడం వివాదంగా మారింది. ఈ విషయంపై ప్రభుత్వానికి సమర్పించిన అఫిడవిట్లో నయనతార దంపతులు తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకున్నామని వెల్లడించినట్లు తెలిసింది.
సరోగసీ వ్యవహారంలో తాము ఎక్కడా నిబంధనల్ని ఉల్లంఘించలేదని, అద్దె తల్లి కూడా తమకు దగ్గరి బంధువేనని నయనతార తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నయనతార దంపతులు ఆరేళ్లక్రితమే తాము రిజిస్టర్ వివాహం చేసుకున్నామని చెప్పడం కొత్త ట్విస్ట్ అంటున్నారు.