న్యూఢిల్లీ: 1998 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ క్రికెటర్ సిద్ధూకు ఏడాది జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో లొంగిపోనున్నట్లు చెప్పిన అతను.. ఇప్పుడు మరింత సమయం కోరారు. కొన్ని వారాల్లోగా లోంగిపోతానని, ఆరోగ్య కారణాల వల్ల ఆలస్యం కానున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టులో సిద్దూ తరపు న్యాయవాది తెలిపారు. లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ ఈ పిటిషన్ వేశారు. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ధర్మాసనం ముందు ఆయన ఈ వివరణ ఇచ్చారు.
సరెండర్ అయ్యేందుకు కొన్ని వారాల సమయం కావాలని, 34 ఏళ్ల తర్వాత ఇది జరుగుతోందని, వైద్య సంబంధిత ఏర్పాట్లను చేసుకోవాలని సిద్దూ తరపున లాయర్ కోర్టును కోరారు. సుప్రీం బెంచ్లో జేబీ పర్దివాలా కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో తీర్పును స్పెషల్ బెంచ్ ఇచ్చిందని, దానికి సంబంధించిన అప్లికేషన్ చీఫ్ జస్టిస్ ముందు ప్రవేశపెట్టాలని,ఒకవేళ సీజేఐ ఆ బెంచ్ను ఇవాళే ఏర్పాటు చేస్తే దాన్ని అంగీకరిస్తామని ఖాన్విల్కర్ బెంచ్ తెలిపింది. ఈ అంశాన్ని సీజే ముందు లేవనెత్తనున్నట్లు లాయర్ సింఘ్వీ తెలిపారు.