‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మంచి సినిమా తీయాలనే సంకల్పంతో ‘నాట్యం’ తెరకెక్కించాం. ‘ఇఫి’కి ఈ సినిమా ఎంపిక కావడంతో మా లక్ష్యం నెరవేరింది’ అని అన్నారు రేవంత్ కోరుకొండ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘నాట్యం’. సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నెల 20న గోవాలో ప్రారంభంకానున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ “ఇఫి’కి ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా ‘నాట్యం’ నిలవడం గర్వంగా అనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో ఈ సినిమా గుర్తింపును దక్కించుకోవడం సంతోషంగా ఉంది. త్వరలో ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’ అని తెలిపారు. ‘కుటుంబ వ్యాపారాల్ని, నృత్యాన్ని వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా అని నిర్మాణ సమయంలో చాలా మంది విమర్శించారు. ‘ఇఫి’కి ఎంపిక కావడం ద్వారా విమర్శకులందరికి సమాధానమిచ్చాం’ అని సంధ్యారాజు చెప్పింది. ఈ కార్యక్రమంలో కమల్కామరాజు, ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.