న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. 314 మంది వైరస్తో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు ముందుటి రోజు(16.66)తో పోల్చితే స్వల్పంగా తగ్గి 16.28కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరింది. శుక్రవారం (6,041)తో పోల్చితే కొత్త కేసుల్లో దాదాపు 28.17 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. కొత్త కేసుల పెరుగుదలతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15.50 లక్షలు (మొత్తం కేసుల్లో 4.18 శాతం) దాటింది. గత 24 గంటల్లో 1.38 లక్షలకు పైగా కరోనా రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు 94.51 శాతానికి తగ్గింది. పార్లమెంట్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఇప్పటివరకూ వైరస్ సోకిన వారి సంఖ్య 850కి చేరింది.
కమ్యూనిటీ స్ప్రెడ్ దశలోకి ఒమిక్రాన్
ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ స్ప్రెడ్) దశకు చేరిందని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సర్వీసెస్ అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ సోకినవారిలో 60.9% మందికి విదేశాల నుంచి వచ్చిన ట్రావెల్ రికార్డు లేదని, ఇండియాలోనే ఇతరుల నుంచి వారికి ఈ వేరియంట్ వ్యాపించిందని తెలిపింది. ఒమిక్రాన్ సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైరాలజీ విభాగం పేర్కొన్నది.
వ్యాక్సిన్కు ఏడాది పూర్తి
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందుబాటులోకి తెచ్చిన వ్యాక్సిన్ కార్యక్రమానికి ఏడాది పూర్తయింది. గతేడాది జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని 157 కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకుంది. 65.48 కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. తొలుత హెల్త్ కేర్ వర్కర్లకు అందించారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్లైన్ వర్కర్లకు, మార్చి 1 తర్వాత వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి అందజేశారు. వ్యాక్సిన్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్రం స్టాంపు విడుదల చేసింది.
డజనుకు పైగా రాష్ర్టాల్లో స్కూళ్లు బంద్
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ర్టాలు ఆంక్షల బాటపట్టాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి.
వివిధ రాష్ర్టాల్లో సెలవులు ఎప్పటివరకంటే..
తమిళనాడు జనవరి 31, మధ్యప్రదేశ్ జనవరి 31, పశ్చిమబెంగాల్ జనవరి 31, కర్ణాటక జనవరి 31, జార్ఖండ్ జనవరి 31, పంజాబ్ జనవరి 25, ఉత్తరప్రదేశ్ జనవరి 23, బీహార్ జనవరి 21, కేరళ జనవరి 21, ఢిల్లీ,ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్లలో.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు.