ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 23 : దేశ విద్యావ్యవస్థలో నూతనంగా రూపొందించిన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) కీలక మైలురాయిగా నిలిచిపోతుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ అన్నారు. ‘సినైర్జెజింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద కాంటెక్ట్స్ ఆఫ్ ఎన్ఈపీ-2020 స్ట్రాటజీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్’అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలోని మ్యాథమెటిక్స్, లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎడ్యుకేషన్ విభాగాలు కలిసి వివిధ ప్రభుత్వరంగ సంస్థలతో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించాయి. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుభాష్ సర్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఈపీలో భాగంగా మల్టీడిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలోనూ ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ త్వరలోనే చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సురేశ్కుమార్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వీసీ ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.కిషన్, ఏబీఆర్ఎస్ఎం జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మహేంద్ర కపూర్, సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శి గుంత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.