Tata Consultancy Serivces | మహారాష్ట్రాలోని నాసిక్ టీసీఎస్ (Tata Consultancy Serivces) బిపిఓ కేంద్రం చుట్టూ అల్లుకున్న వివాదంలో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ (Nida Khan) విషయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యాజమాన్యం అత్యంత కీలకమైన ప్రకటనను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ప్రధాన మీడియా ఛానెళ్లు మరియు సామాజిక మాధ్యమాల్లో ఆమెను హెచ్ఆర్ హెడ్గా, రిక్రూట్మెంట్ ప్రక్రియను శాసించే ‘మాస్టర్మైండ్’గా, పాకిస్థాన్తో టెర్రర్ లింక్లు ఉన్నాయంటూ అభివర్ణిస్తూ వస్తున్న కథనాలను సంస్థ తీవ్రంగా ఖండించింది. కంపెనీ అధికారిక రికార్డుల ప్రకారం నిదా ఖాన్ కేవలం ఒక సాధారణ స్థాయి ‘ప్రాసెస్ అసోసియేట్’ లేదా ‘టెలికాలర్’గా మాత్రమే బాధ్యతలు నిర్వహించారని, ఆమెకు రిక్రూట్మెంట్ నిర్ణయాలు తీసుకునే అధికారం గానీ లేదా ఎటువంటి నాయకత్వ బాధ్యతలు గానీ లేవని టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిదా ఖాన్ గర్భిణిగా ఉండడంతో ఆమె సెలవులలో ఉన్నట్లు ప్రకటించింది.
మరోవైపు ఈ వ్యవహారంపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు, నిజాన్ని రాబట్టేందుకు టీసీఎస్ యాజమాన్యం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ విచారణ ప్రక్రియలో పారదర్శకత కోసం అంతర్జాతీయ స్థాయి సంస్థలైన డెలాయిట్, ట్రైలీగల్ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. నాసిక్ కేంద్రంలో జరిగినట్లుగా చెబుతున్న లైంగిక వేధింపులు మరియు మతమార్పిడి ఆరోపణల నేపథ్యంలో, అసలు దోషులెవరో తేల్చేందుకు ఈ కమిటీ లోతైన పరిశీలన చేయబోతుంది. మరోవైపు మహారాష్ట్ర పోలీసులు మరియు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాయి. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా టీసీఎస్ ఇచ్చిన ఈ వివరణతో, కేవలం మీడియా ప్రచారం ఆధారంగా ఒక సాధారణ ఉద్యోగిని అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తిగా భావించడం సరికాదని స్పష్టమవుతోంది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ఇటువంటి తీవ్రమైన ఆరోపణల విషయంలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.