Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయన అలవాటుగా మారిందని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ గొప్ప వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
‘అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోదీ గొప్పవారు. అబద్ధాలను మార్కెట్ చేయడంలో కూడా ఆయన దిట్ట. అసంబద్ధమైన మాటలు మాట్లాడి ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారు. ఎదుటి వారి గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యలు ప్రధానమంత్రి పదవిపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయి’ అని సిద్ధరామయ్య విమర్శించారు.
మోదీ చేసిన రిజర్వేషన్, మంగళసూత్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందని, వాటిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిద్ధరామయ్య అన్నారు. ప్రధాని అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని, బాగానే అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ లోక్సభ ఎన్నికల్లోనూ తాము ఇచ్చిన ఎన్నికల హామీలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు.
తాము ఇచ్చిన ఐదు హామీలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయని కర్ణాటక సీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఉందని, అదే తమ గెలుపునకు సంకేతమని అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ విచక్షణను బట్టి తీర్పు ఇస్తారని, ఓటర్లు తెలివైన వారని చెప్పారు. మాయ మాటలు నమ్మరని, రాజకీయంగా పరిణతి చెందారని వ్యాఖ్యానించారు.