నారాయణపేట, అక్టోబర్ 21 : పట్టణంలో ఏర్పాటు చేసిన పిల్లల దవాఖాలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్ అన్నారు. గురువారం వేల్స్ ఫార్గో ఆర్థిక సహకారంతో యునైటెడ్ వే హైదరాబాద్, బెంగళూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మోడ్యూలాస్ స్టార్టప్ వారు నిర్మించిన 100 పడకల చిన్న పిల్లల వైద్యశాలను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఎస్.రా జేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన, మున్సిపల్ చైర్పర్సన్ గందెఅనసూయ, వేల్స్ ఫార్గో ప్రతినిధి శ్రీధర్ చండూరి, యునైటెడ్ వే బెంగళూర్ ప్రతినిధి రాజేష్ కృష్ణన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల్స్ పార్గో ద్వారా రూ.4.20 కోట్ల వ్యయంతో దవాఖాన నిర్మించినట్లు తెలిపారు. ఎంపీ మన్నె, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ కొవిడ్ థర్డ్ వేవ్లో పిల్లలకు కరోనా వస్తే చికిత్సలు అందించే విధంగా దవాఖాన నిర్మించినట్లు తెలిపారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్, వేల్స్ ఫార్గో దాతృ త్వం, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, బెంగళూర్ వారి సహకారంతో తక్కువ సమయంలోనే వైద్యశాలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. హైదరాబాద్కు దూరంగా కర్ణాటక రాష్ర్టానికి సరిహద్దున ఉన్న ఈ దవాఖానలో చిన్నారులకు వైద్య సేవలు అందించేందుకు ఎం తో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మోడ్యూలాస్ స్టార్టప్ సీఈవో శ్రీరామ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.