నారాయణఖేడ్, మార్చి 3 : పలు అభివృద్ధి పనుల నిమిత్తం నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో నారాయణఖేడ్ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంజూరైన నిధులతో చేపట్టబోయే పనులను గుర్తించేందుకు గురువారం ఎమ్మెల్యే మున్సిపాలిటీ పరిధిలోని 1,2,3 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, మురికి కాల్వలు, నీటి సరఫరాను క్రమబద్ధీకరించడం, వీధి లైట్లు, తదితర అవసరాలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో ప్రజావసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు వెచ్చిస్తామన్నారు. ఇప్పటికే రూ.15 కోట్ల నిధులతో ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. రెండు మూడు రోజుల పాటు మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో తాను స్వయంగా పర్యటించి సమస్యలను గుర్తించి పనులు చేపట్టే విధంగా అధికారులను ఆదేశిస్తామన్నారు.
ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మూడ రాంచందర్, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, నాయకులు విఠల్, అభిషేక్ శెట్కార్, సత్యనారాయణ, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు నగేశ్, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్ పాల్గొన్నారు.