ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. ఏపీలో 58 మంది ఎమ్మెల్సీలుండగా.. వీరిలో 48 మంది ఎమ్మెల్సీల ఆస్తులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసులు, వారి చదువు తదితర అంశాలను విశ్లేషించిన అనంతరం ఏడీఆర్ ఈ నివేదికను విడుదల చేసింది. అఫిడవిట్లు అందుబాటులో లేని ఎమ్మెల్సీల వివరాలను పరిశీలించలేదు.
రాష్ట్రంలోని మొత్తం 48 మంది ఎమ్మెల్సీలకు గానూ 36 మంది (75 శాతం) కోటీశ్వురులేనని ఏడీపీ తన నివేదికలో తెలిపింది. వైసీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్సీలు కోటీశ్వరులు.. టీడీపీ నుంచి 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రూ.369.27 కోట్ల ఆస్తులతో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్సీగా నిలిచారు. లోకేశ్కు రూ.6.27 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. 2019 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనకు రూ.330 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ మొత్తం 2016 ఎన్నికల్లో ఆయన వెల్లడించిన ఆస్తుల కంటే 23 రెట్లు ఎక్కువ కావడం విశేషం. టీడీపీకే చెందిన వాకాటి నారాయణ రెడ్డి రూ.101.08 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు రూ.36.99 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు. అతి తక్కువగా ఆస్తులున్న ఎమ్మెల్సీగా వైసీపీకి చెందిన పాలకపాటి రఘువర్మ (రూ.1.84 లక్షలు) నిలిచారు.
రాష్ట్రంలోని ఎమ్మెల్సీల్లో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్లో తెలిపింది. అధికార పార్టీకి చెందిన 13 మంది, టీడీపీకి చెందిన ఆరుగురు, పీడీఎఫ్కు చెందిన ఒక ఎమ్మెల్సీ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఒకరిపై హత్యాయత్నం కేసు ఉండగా, మరొకరిపై మహిళలపై లైంగికదాడి కేసు నమోదైంది.