నల్లగొండ /నిడమనూరు : నాగార్జున సాగర్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం రెండోరోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ తెలిపారు.
నిన్న ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 27, 28, 29 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు అవకాశం ఉండదు.
30వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది.
ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్, సువిధ, సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించింది.
సాధారణ పరిశీలకుడిగా యూపీకి చెందిన ఐఏఎస్ అధికారి రాహుల్ సింగ్ను, వ్యయ పరిశీలకుడిగా ప్రశాంత్ కుమార్ ఝాను నియమించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి